రాగల 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

  • ఆగ్నేయ బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం
  • ఆ తర్వాత 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం
  • రేపు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు సహా 6 జిల్లాల్లో భారీ వర్షాలు
  • మిగిలిన జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు
  • సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని సూచన
  • అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించిన విపత్తుల సంస్థ
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది రాష్ట్రంపై ప్రభావం చూపనుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ విషయంపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సోమవారం వివరాలు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, ఆ తర్వాతి 48 గంటల్లో మరింత బలపడి దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వివరించారు.

ముఖ్యంగా మంగళవారం నాడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేశారు. మిగిలిన జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలకు సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.


More Telugu News