రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి

  • ఆసుపత్రి బయట ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కునే ప్రయత్నం చేశాడన్న డీజీపీ
  • రియాజ్‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారన్న డీజీపీ
  • ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎన్‌కౌంటర్ చేసినట్లు వెల్లడి
రౌడీషీటర్ రియాజ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనపై తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. రియాజ్ తప్పించుకుని పారిపోతూ పోలీసులపై మరోసారి దాడికి పాల్పడ్డాడని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ బాత్రూంకు వెళ్లి తిరిగి వస్తూ బయట ఉన్న ఏఆర్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, గన్ లాక్కునే ప్రయత్నం చేశాడని ఆయన పేర్కొన్నారు. రియాజ్‌ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని చెప్పారు.

అయితే, పోలీసుల వద్ద ఉన్న ఆయుధాన్ని లాక్కుని కాల్పులకు ప్రయత్నించాడని డీజీపీ వెల్లడించారు. రియాజ్ గన్ ఫైర్ చేసి ఉంటే ప్రజల ప్రాణాలు పోయేవని ఆయన అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో భాగంగానే ఎన్‌కౌంటర్ జరిపినట్లు తెలిపారు.

పోలీసులు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపారని, దీంతో రియాజ్ మరణించినట్లు వెల్లడించారు. ఆదివారం కూడా అతడిని పట్టుకునే సమయంలో ఆసిఫ్‌ అనే పౌరుడిపై కూడా దాడి చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఈరోజు మరో కానిస్టేబుల్‌పై దాడి చేశాడని డీజీపీ తెలిపారు.

రియాజ్ హతమైన విషయాన్ని డీజీపీ ఎక్స్ వేదికగా కూడా ధృవీకరించారు.


More Telugu News