ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక.. పదోన్నతులపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

  • డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లకు పదోన్నతులు
  • పాత పద్ధతిలోనే ప్రమోషన్లు ఇవ్వాలని నిర్ణయం
  • శిక్షలు, పెనాల్టీలతో సంబంధం లేకుండా పదోన్నతులు
  • ఉద్యోగ సంఘాల డిమాండ్‌కు సీఎం చంద్రబాబు ఆమోదం
దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ఆమోదం తెలుపుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగుల కుటుంబాల్లో పండుగ ఆనందం రెట్టింపు కానుంది.

పాత విధానానికే ఆమోదం
ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం.. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లతో పాటు ఇతర కేడర్లలోని ఉద్యోగులకు త్వరలోనే పదోన్నతులు కల్పించనున్నారు. గతంలో వారిపై నమోదైన క్రమశిక్షణా చర్యలు, శిక్షలు లేదా పెనాల్టీలతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కాకముందు ఇదే విధానం అమల్లో ఉండేది.

2020లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు వర్తించే నిబంధనలనే ఆర్టీసీ సిబ్బందికి కూడా అమలు చేశారు. దీంతో పదోన్నతుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పాత విధానాన్నే కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు పాత పద్ధతిలోనే పదోన్నతులు కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తమకు నిజమైన దీపావళి కానుక అని అభివర్ణించారు.


More Telugu News