బ్యాటింగ్ డెప్త్ పిచ్చి ఏంటి?.. టీమిండియాపై అశ్విన్ ఫైర్..!

  • ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో కుల్దీప్‌ యాదవ్‌పై వేటు
  • టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టిన అశ్విన్
  • బ్యాటింగ్ డెప్త్ కోసం బౌలింగ్‌ను పణంగా పెట్టొద్దని హితవు
  • పెర్త్ లాంటి పెద్ద మైదానాల్లో కుల్దీప్ కీలకం అని వ్యాఖ్య
  • ముగ్గురు ఆల్‌రౌండర్లు అవసరమా? అని సూటి ప్రశ్న
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఓటమి పాలవగా, టీమ్ మేనేజ్‌మెంట్ ఎంపిక చేసిన తుది జట్టుపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టు ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించాడు. బ్యాటింగ్ డెప్త్ (లోతైన బ్యాటింగ్ లైనప్) కోసం బౌలింగ్‌ను పణంగా పెట్టడం సరైన వ్యూహం కాదని చురకలంటించాడు.

ఆదివారం పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ముగ్గురు ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లతో బరిలోకి దిగింది. ఈ క్రమంలో కుల్దీప్‌కు స్థానం లభించలేదు. దీనిపై తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన అశ్విన్, మేనేజ్‌మెంట్ ఆలోచనా విధానాన్ని ప్రశ్నించాడు. "బ్యాటింగ్ డెప్త్ కోసం ఇద్దరు స్పిన్ ఆల్‌రౌండర్లను ఎందుకు ఆడించారో అర్థం చేసుకోగలను. కానీ, కొంచెం బౌలింగ్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి కదా? పెర్త్ లాంటి పెద్ద మైదానాల్లో కూడా కుల్దీప్ స్వేచ్ఛగా బౌలింగ్ చేయలేకపోతే, ఇంకెక్కడ చేస్తాడు? అక్కడ బంతికి లభించే ఓవర్ స్పిన్, బౌన్స్ అతనికి బాగా కలిసొచ్చేవి" అని అశ్విన్ విశ్లేషించాడు.

జట్టులో ఇప్పటికే నితీశ్, అక్షర్, వాషింగ్టన్ రూపంలో ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉన్నారని గుర్తుచేశాడు. "ఇంతమంది ఆల్‌రౌండర్లు అవసరమా? ఇంతమంది ఉన్నా కూడా మీ అత్యుత్తమ స్పిన్నర్‌ను ఆడించలేకపోతే, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు" అని అశ్విన్ వ్యాఖ్యానించాడు.

బ్యాటింగ్ డెప్త్ పేరుతో బ్యాటర్లకు రక్షణ కల్పించడం సరికాదని, పరుగులు చేయాల్సిన బాధ్యత బ్యాటర్లదేనని అశ్విన్ స్పష్టం చేశాడు. "మీరు అదనంగా ఒక బ్యాటర్‌ను ఆడిస్తున్నారంటే, అది బ్యాటర్లను కాపాడటానికే. నా అభిప్రాయం ఒక్కటే.. ఎప్పుడైనా మీ అత్యుత్తమ బౌలర్లనే ఆడించాలి. కేవలం బ్యాటింగ్ లైనప్‌ను పొడిగించడం కోసం జట్టును ఎంపిక చేయొద్దు" అని టీమ్ మేనేజ్‌మెంట్‌కు హితవు పలికాడు. కాగా, ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ డెప్త్ ఉన్నప్పటికీ, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు 26 ఓవర్లలో కేవలం 136 పరుగులకే పరిమితమై ఓటమి చవిచూడటం గమనార్హం.


More Telugu News