Chandrababu Naidu: ఆర్థిక వెసులుబాటు వస్తే పీఆర్సీ కూడా ఇస్తాం: సీఎం చంద్రబాబు

Chandrababu Says PRC Will Be Given After Financial Improvement
షార్ట్స్‌లో చూడండి
"రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉంది, గూడుపుఠాణీలకు తావులేదు. గత పాలకులు చేసిన అప్పులు, అనుత్పాదక వ్యయం రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు ఉద్యోగులు ప్రభుత్వంతో కలిసి రావాలి. ఆర్థిక వెసులుబాటు రాగానే తప్పకుండా పీఆర్‌సీ ఇస్తాం, దీనికి కొంత సమయం పడుతుంది" అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగ సంఘాలను కోరారు. దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు ఒక మంచి వార్త చెప్పాలనే ఉద్దేశంతోనే వారితో సమావేశమైనట్లు ఆయన తెలిపారు.

శనివారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీఎన్జీవో, ఏపీ జేఏసీ అమరావతి, సచివాలయ ఉద్యోగ సంఘం సహా పలు ఉపాధ్యాయ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి స్పష్టత ఇచ్చారు.

రాష్ట్ర మొత్తం వ్యయంలో 91 శాతం, అంటే రూ.51,452 కోట్లు కేవలం ఉద్యోగుల జీతభత్యాలకే వెళ్తోందని సీఎం వివరించారు. "గత ఐదేళ్లలో పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ (38%), తమిళనాడు (42%), కర్ణాటక (39%) తమ వ్యయాన్ని తగ్గించుకుంటే, మన రాష్ట్రంలో మాత్రం భవిష్యత్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేశారు. ఈ విధ్వంసాన్ని సరిదిద్దేందుకే ప్రజలు కూటమికి 94 శాతం స్ట్రైక్ రేట్‌తో అఖండ విజయాన్ని అందించారు," అని చంద్రబాబు అన్నారు.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన సీపీఎస్ రద్దు అంశంపై కూడా ఆయన స్పందించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు తీర్పు ఉందని, దానిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఒక కేబినెట్ సబ్ కమిటీ ఉందని, ఎప్పటికప్పుడు సమస్యలను చర్చించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

రాష్ట్రానికి ఉద్యోగులే ప్రధాన రథచక్రాలని, వారు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని సీఎం పేర్కొన్నారు. "ప్రభుత్వం పాలసీలను తీసుకొస్తుంది, కానీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఉద్యోగులే. సంపద సృష్టిస్తేనే సంక్షేమం సాధ్యమవుతుంది. గూగుల్ వంటి దిగ్గజ సంస్థ విశాఖకు రావడం సుపరిపాలన వల్లే సాధ్యమైంది. అందరం కలిసి 'ప్రభుత్వం మనది' అనే భావనతో పనిచేసి, రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధిలో నంబర్ వన్‌గా నిలుపుదాం" అని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ, ఆప్కాస్ ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగానే చూస్తున్నామని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులందరికీ ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
AP CM
PRC
employees salaries
CPS
financial situation
government employees
state development
Amaravati

More Telugu News