ఈసారి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో బుధవారం నుంచి భారీవర్షాలు

  • మంగళవారం నాటికి అల్పపీడనం
  • గురువారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం
  • బుధవారం నుంచి రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరిక
  • ఆదివారం 17 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
  • ఉరుముల సమయంలో చెట్ల కింద ఉండొద్దని ప్రజలకు సూచన
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. బుధవారం నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం దీనికి కారణంగా పేర్కొంది.

ఈ మేరకు ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వివరాలను వెల్లడించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇది మరింత బలపడి గురువారం నాటికి దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

దీని ప్రభావంతో ఆదివారం నుంచే పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలవుతాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించారు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు. సురక్షితమైన భవనాల్లో ఉండటం శ్రేయస్కరమని తెలిపారు.

కాగా, శనివారం సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రంలో పలుచోట్ల వర్షపాతం నమోదైందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 49.7 మిల్లీమీటర్లు, కృష్ణా జిల్లా ఘంటసాలలో 44.7 మిల్లీమీటర్లు, తిరుపతి జిల్లాలో 27.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.


More Telugu News