'బాహుబలి: ది ఎపిక్' సెన్సార్ పూర్తి.. కొత్త వెర్షన్ నిడివి ఇదే!

  • 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో సింగిల్ పార్ట్‌గా రెండు సినిమాలు
  • సెన్సార్ పూర్తి.. U/A సర్టిఫికెట్ జారీ
  • ఫైనల్ అయిన రన్‌టైమ్.. 3 గంటల 44 నిమిషాలు
  • కొన్ని పాత సీన్లకు కత్తెర.. చేరనున్న కొత్త సన్నివేశాలు
  • ఈ నెల‌ 31న గ్రాండ్ రిలీజ్.. 29న యూఎస్‌లో ప్రీమియర్లు
భారతీయ సినిమా చరిత్రలో ఒక సంచలనం సృష్టించిన 'బాహుబలి' మళ్లీ ప్రేక్షకుల ముందుకు సరికొత్త రూపంలో రాబోతోంది. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో ఒకే చిత్రంగా విడుదల చేయనున్నారు. ఈ కొత్త వెర్షన్ రన్‌టైమ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ, మేకర్స్ అధికారికంగా వివరాలు ప్రకటించారు.

ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. రెండు భాగాలను కలిపి రూపొందించిన ఈ సింగిల్ వెర్షన్ నిడివిని 3 గంటల 44 నిమిషాలుగా ఖరారు చేసినట్లు చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ఇటీవలి కాలంలో అత్యధిక రన్‌టైమ్‌ ఉన్న భారతీయ చిత్రాల్లో ఒకటిగా 'బాహుబలి: ది ఎపిక్' నిలవనుంది.

వాస్తవానికి 'బాహుబలి' రెండు భాగాల మొత్తం నిడివి 5 గంటల 27 నిమిషాలు. అయితే 'ది ఎపిక్' కోసం దాదాపు గంటన్నరకు పైగా నిడివిని తగ్గించారు. దీనికోసం మేకర్స్ ప్రత్యేకంగా ఎడిటింగ్ చేశారు. ఒరిజినల్ వెర్షన్లలోని కొన్ని సన్నివేశాలను తొలగించి, అప్పట్లో విడుదల చేయని కొన్ని కొత్త సన్నివేశాలను జోడించినట్లు తెలుస్తోంది. అయితే ఏ సీన్లను తొలగించారు, ఏవి కొత్తగా చేర్చారనేది మాత్రం సినిమా చూసే తెలుసుకోవాలని మేకర్స్ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.

‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సరికొత్త వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 31న భారత్‌లో విడుదల కానుండగా, రెండు రోజుల ముందే అంటే అక్టోబర్ 29నే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. రాజమౌళి సృష్టించిన ఈ దృశ్య కావ్యం సరికొత్త ఎడిటింగ్‌తో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుందో చూడాలి.



More Telugu News