Team India: సెమీస్ రేసులో నిలవాలని.. మహాకాళేశ్వర ఆలయంలో మహిళా క్రికెట్ జట్టు పూజలు

ప్రస్తుత ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో వరుస ఓటములతో ఒత్తిడిలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న మన క్రీడాకారిణులు.. బుధవారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సభ్యులు తెల్లవారుజామున జరిగే పవిత్రమైన భస్మ హారతిలో పాల్గొన్నారు. అనంతరం నంది హాల్‌లో కొంత సమయం గడిపి మహాకాళుడి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ ప్రపంచ కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించి శుభారంభం చేసిన భారత జట్టు, ఆ తర్వాత వైజాగ్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లతో జరిగిన మ్యాచ్‌లలో పరాజయం పాలైంది. దీంతో జట్టు సెమీస్ ప్రయాణం కాస్త కష్టంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న భారత్.. నాలుగు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లతో 0.682 నెట్ రన్ రేటుతో కొనసాగుతోంది. లీగ్ దశలో మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

గత మ్యాచ్‌లో పటిష్ఠ‌మైన ఆస్ట్రేలియా జట్టుకు గట్టి పోటీ ఇవ్వడం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, రిచా ఘోష్ వంటి బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉండగా, దీప్తి శర్మ, స్నేహ్ రాణా వంటి బౌలర్లు వికెట్లు తీస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే, కీలక దశలో టోర్నీలో నిలవాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సెమీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారత్ తన తదుపరి మ్యాచ్‌లలో ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లపై విజయం సాధించి మొత్తం 10 పాయింట్లను ఖాతాలో వేసుకోవాల్సి ఉంటుంది. ఆదివారం ఇండోర్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ఆ తర్వాత 23న న్యూజిలాండ్‌తో, 26న బంగ్లాదేశ్‌తో నవీ ముంబైలో మ్యాచ్‌లు ఆడనుంది.
Team India
Harmanpreet Kaur
India women cricket team
Mahakaleshwar Temple
ICC Women's World Cup
Indian cricket team
Smriti Mandhana
Cricket
Ujjain
Sports

More Telugu News