చిన్నారి అభిమాని కోసం సెక్యూరిటీ గార్డుపై రోహిత్ శర్మ ఫైర్.. వీడియో ఇదిగో!

  • ముంబైలో ప్రాక్టీస్ సందర్భంగా అభిమాని పట్ల రోహిత్ ఉదారత
  • చిన్నారిని అడ్డుకున్న సెక్యూరిటీ గార్డుపై హిట్‌మ్యాన్ ఆగ్రహం
  • అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సన్నద్ధం
  • శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో స్పెషలిస్ట్ బ్యాటర్‌గా బరిలోకి రోహిత్
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన పెద్ద మనసును చాటుకున్నారు. ఓ చిన్నారి అభిమాని కోసం సెక్యూరిటీ గార్డుపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు ముందు ముంబైలోని శివాజీ పార్క్‌లో రోహిత్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ బాలుడు అతడిని కలిసేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఇది గమనించిన రోహిత్ వెంటనే జోక్యం చేసుకుని, ఆ గార్డును మందలించాడు. చిన్నారిని తన వద్దకు అనుమతించాలని సూచించాడు. 

ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ సెషన్‌లో చూడచక్కని కవర్ డ్రైవ్‌లు, స్వీప్ షాట్లతో అలరించాడు. అభిమానులు 'హిట్‌మ్యాన్' నినాదాలతో రోహిత్‌ను ఉత్సాహపరిచారు. భారత మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో జరిగిన ఈ శిక్షణలో యువ క్రికెటర్ అంక్రిష్ రఘువంశీ కూడా పాల్గొన్నాడు. రోహిత్ భార్య రితికా సజ్దే కూడా వచ్చి ఈ సెషన్‌ను వీక్షించారు.

ప్రస్తుతం వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న రోహిత్ సీనియర్ బ్యాటర్‌గా తన పాత్రపై పూర్తి దృష్టి సారించాడు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఎంపికైన జట్టులో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, రోహిత్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఆడనున్నాడు. రోహిత్, విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని, మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఈ ఇద్దరు దిగ్గజాలు ఈ ఏడాది దేశవాళీ క్రికెట్‌లో కూడా పాల్గొనే అవకాశం ఉంది. 


More Telugu News