AP Ration Card: రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వారు అనర్హులే!

Ration Card e KYC Mandatory For Transparency In AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. వరుసగా మూడు నెలలపాటు రేషన్ సరుకులు తీసుకోకపోయినా, ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోయినా వారి కార్డులు రద్దు కానున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడటంతో పాటు, అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.

పంపిణీ వ్యవస్థలో పారదర్శకతకు ఈ-కేవైసీ తప్పనిసరి
రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-కేవైసీని తప్పనిసరి చేశాయి. ఈ ప్రక్రియను పూర్తి చేయని వారి స్మార్ట్ కార్డులను అధికారులు నిలిపివేస్తున్నారు. అదేవిధంగా, వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోని వారిని కూడా అనర్హులుగా పరిగణించి, వారి కార్డులను రద్దు చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. అందుకే కార్డుదారులు ప్రతి నెలా తప్పనిసరిగా సరుకులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా ప్రకాశం జిల్లా గణాంకాలను పరిశీలిస్తే, ఇక్కడ మొత్తం 6,61,141 రేషన్ కార్డులు ఉండగా, కేవలం 5.72 లక్షల కుటుంబాలు మాత్రమే ప్రతినెలా బియ్యం తీసుకుంటున్నాయి. దాదాపు 14 శాతం మంది సరుకులు అందుకోవడం లేదని తేలింది. ఈ నేపథ్యంలో ఈ-కేవైసీ చేసుకోని వారి వివరాలను రేషన్ డీలర్ల ద్వారా సేకరించి, వారి స్మార్ట్ కార్డులను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ.. ప్రకాశం జిల్లాలో ఏర్పాట్లు 
మరోవైపు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో చివరి విడత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రకాశం జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొత్త కార్డులు, కుటుంబ సభ్యుల మార్పుల కోసం జిల్లాలో సుమారు 1.50 లక్షల దరఖాస్తులు రాగా, జులై నెలాఖరు నాటికి పరిశీలించిన 17 వేల దరఖాస్తులలో 14,296 మందిని అర్హులుగా గుర్తించి వారికి స్మార్ట్ కార్డులు మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం సిద్ధమైన కార్డులను మండలాల వారీగా తహసీల్దార్ కార్యాలయాలకు తరలించారు. త్వరలోనే వీటి పంపిణీ ప్రారంభం కానుంది.
Go Back to Shorts
AP Ration Card
Ration Card
Andhra Pradesh
e-KYC
Ration Distribution
Prakasam District
Smart Ration Card
Civil Supplies Department

More Telugu News