వెనుకబడిన ప్రాంతాలకు ఆ నిధులే కీలకం... నిర్మలా సీతారామన్ కు వివరించిన సీఎం చంద్రబాబు

  • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
  • పూర్వోదయ పథకం కింద ఏపీకి నిధులు కేటాయించాలని వినతి
  • రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధులు అత్యవసరం అని వెల్లడి
  • రాష్ట్రంలోని ప్రాజెక్టుల ప్రణాళికలను వివరించిన ముఖ్యమంత్రి
  • పోలవరం పురోగతిపై కేంద్ర జలశక్తి మంత్రితోనూ చర్చలు
ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాల ఆర్థిక ప్రగతికి ‘పూర్వోదయ’ పథకం కింద ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ఈ నిధులే కీలకమని ఆయన నొక్కిచెప్పారు.

దేశంలోని తూర్పు ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం పూర్వోదయ పథకానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఏపీపై దృష్టి పెట్టాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పూర్వోదయ పథకంలో భాగంగా బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేశారు. పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్ర ఆర్ధిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. 

రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం తన విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. ఈ రంగాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎకనమిక్ డెవలప్మెంట్ కు పూర్వోదయ పథకం అమలు ఎంతో దోహదం చేస్తుందని అన్నారు. వెనుక బడిని ప్రాంతాల ఆర్థిక అభివృద్దికి దోహదం చేసేలా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ ను కోరారు. 

అనంతరం కేంద్ర జలశక్తి శాఖామంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. పోలవరం పనుల పురోగతిని గురించి కేంద్రమంత్రికి సీఎం వివరించారు.


More Telugu News