నన్ను ఏమైనా చేసుకోండి... మా వాళ్లను వేధించవద్దు: టీవీకే చీఫ్ విజయ్ భావోద్వేగ వీడియో

  • కరూర్ తొక్కిసలాట ఘటనపై స్పందించిన నటుడు, టీవీకే అధినేత విజయ్
  • ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన
  • త్వరలోనే బాధితులను స్వయంగా కలుస్తానని వెల్లడి
  • నిజానిజాలు త్వరలోనే బయటపడతాయని ధీమా
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని పేర్కొన్నారు. ఈ ఘటనతో తన గుండె బద్దలైందని, మాటలు రావడంలేదని అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక భావోద్వేగ వీడియో విడుదల చేశారు.

కరూర్ ఘటనపై ఆయన మాట్లాడుతూ, "నా జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఈ దురదృష్టకర ఘటన జరిగి ఉండాల్సింది కాదు. నేను కూడా మనిషినే... అంతమంది చనిపోయారని తెలిస్తే అక్కడ్నించి వెళ్లిపోతానా?... ర్యాలీ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నా గానీ ఊహించని ఘటన జరిగింది" అని విజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతేకాదు, విమర్శల పట్ల విచారం వ్యక్తం చేశారు. "నన్ను టార్గెట్ చేసుకోండి కానీ, మా నేతలను వేధించవద్దు... సీఎం స్టాలిన్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నన్ను ఏమైనా చేసుకోండి" అంటూ భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు.

తాను భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తానని, త్వరలోనే తాను స్వయంగా బాధితులను కలిసి పరామర్శిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన అసలు నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

త్వరలో తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని విజయ్ తెలిపారు. 


More Telugu News