ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రూ.2,745 కోట్లు విడుదల.. రేపే పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా 63.50 లక్షల మందికి అందనున్న లబ్ధి
రేపు పింఛన్ల పంపిణీకి పూర్తి ఏర్పాట్లు
కొత్తగా 10,578 స్పౌజ్ పెన్షన్లకు ప్రభుత్వం ఆమోదం
విజయనగరం జిల్లాలో పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
స్పౌజ్ పెన్షన్ల కోసం అదనంగా రూ.4.23 కోట్లు కేటాయింపు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబరు 1న అందించే పింఛన్ల కోసం రూ.2,745.05 కోట్లను గ్రామ, వార్డు సచివాలయాలకు విడుదల చేసినట్లు సెర్ప్‌ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నిధులతో రాష్ట్రంలోని 63,50,765 మందికి పింఛన్లు అందనున్నాయని మంత్రి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దీనికి అదనంగా, కొత్తగా మంజూరు చేసిన 10,578 స్పౌజ్ పెన్షన్ల (భార్య లేదా భర్త మరణిస్తే జీవించి ఉన్న వారికి ఇచ్చే పింఛను) కోసం ప్రభుత్వం మరో రూ.4.23 కోట్లను విడుదల చేసిందని ఆయన వివరించారు. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల కింద ఇప్పటివరకు లబ్ధిదారులకు రూ.45 వేల కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి గుర్తుచేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పింఛన్ల కోసం బడ్జెట్‌లో రూ.32,143 కోట్లు కేటాయించగా, అక్టోబరు నెల పంపిణీతో కలిపి ఇప్పటివరకు రూ.19,111.85 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. పింఛన్ల పంపిణీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు.


More Telugu News