నా స్టాప్ వచ్చింది.. బస్సు దిగి కొత్త మార్గంలో వెళ్లవలసి ఉంది: చివరిరోజు బస్సులో ప్రయాణించిన సజ్జనార్

  • నా బస్సును పార్క్ చేసి తదుపరి సవాల్ దిశగా ప్రయాణం చేయాల్సి ఉందన్న సజ్జనార్
  • నా అనుభవాలను త్వరలో వివరణాత్మకంగా పంచుకుంటానని వెల్లడి
  • బస్సులో ప్రయాణించి టిక్కెట్ తీసుకున్న సజ్జనార్
నాలుగు సంవత్సరాలుగా టీజీఎస్‌ఆర్టీసీలో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం, ఇప్పుడు బస్సు దిగి కొత్త మార్గంలో పయనించాల్సిన సమయం ఆసన్నమైందని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్‌ను హైదరాబాద్ సీపీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో సజ్జనార్ 'ఎక్స్' వేదికగా స్పందించారు.

"ప్రయాణాలు ఆగిపోవచ్చు, కానీ ప్రయాణికులు ముందుకు సాగుతూనే ఉంటారు. ఇప్పుడు నా బస్సును పార్క్ చేసి తదుపరి సవాల్ దిశగా ప్రయాణం వేగవంతం చేయాల్సిన సమయం వచ్చింది. టీజీఎస్ఆర్టీసీకి డ్రైవర్లు, కండక్టర్లు జీవనాడి. అంకితభావంతో పనిచేసిన ప్రతి ఉద్యోగికి, ప్రయాణికుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అని ఆయన పేర్కొన్నారు. త్వరలో టీజీఎస్ఆర్టీసీలో తన అనుభవాలను వివరణాత్మకంగా పంచుకుంటానని సజ్జనార్ తెలిపారు.

సాధారణ ప్రయాణికుడిలా బస్సులో ప్రయాణించిన సజ్జనార్

టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజున వీసీ సజ్జనార్ ప్రజారవాణాపై తన అనుబంధాన్ని చాటుకుంటూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా లక్డీకాపుల్-టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 113 I/M రూట్ బస్సులో ప్రయాణించారు. యూపీఐ ద్వారా చెల్లింపు చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు.


More Telugu News