ఆసియా కప్ ఫైనల్... టాస్ గెలిచిన టీమిండియా... నిలకడగా ఆడుతున్న పాక్

  • ఆసియా కప్ ఫైనల్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
  • గాయం కారణంగా ఫైనల్ మ్యాచ్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా
  • హార్దిక్ స్థానంలో జట్టులోకి వచ్చిన శివమ్ దూబే
  • 41 ఏళ్ల తర్వాత ఆసియా కప్ ఫైనల్‌లో తలపడుతున్న భారత్, పాకిస్థాన్
  • ఈ టోర్నీలో పాక్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియాదే విజయం
యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ 2025 ఫైనల్ పోరు ప్రారంభమైంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతున్న టైటిల్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా తుది జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో శివమ్ దూబే వచ్చాడు. రింకూ సింగ్‌కు కూడా తుది జట్టులో చోటు కల్పించారు.

శ్రీలంకతో జరిగిన గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్ సందర్భంగా హార్దిక్ పాండ్యా కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఫైనల్ నాటికి అతను కోలుకోలేకపోవడంతో జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. హార్దిక్ లేని లోటు జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన శివమ్ దూబే కొత్త బంతితో బౌలింగ్ బాధ్యతలు చేపట్టనుండగా, రింకూ సింగ్ ఫినిషర్ పాత్ర పోషించనున్నాడు.

టాస్ గెలిచిన అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, "పిచ్ చాలా బాగుంది. లైట్ల వెలుతురులో బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారుతుంది. అందుకే ఛేజింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. గత కొన్ని మ్యాచ్‌లుగా మేం ఆడుతున్న తీరు మాకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోంది. ఇదే జోరును ఫైనల్‌లోనూ కొనసాగిస్తాం" అని ధీమా వ్యక్తం చేశాడు.

పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడుతూ, "మేం ముందుగా బ్యాటింగ్ చేయడమే సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంట్‌లో మేమింకా మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేదు. ఈరోజు ఫైనల్‌లో ఆ లోటు తీరుస్తామని ఆశిస్తున్నాం" అని అన్నాడు.

దాదాపు 41 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ తలపడుతుండటం విశేషం. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే రెండుసార్లు ఈ జట్లు పోటీపడగా, గ్రూప్ దశలో, సూపర్ ఫోర్స్‌లోనూ భారతే ఘన విజయం సాధించింది.

తుది జట్లు

భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలాత్, మహమ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

కాగా, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. సీనియర్ ఆటగాడు ఫఖార్ జమాన్ 22, సాహిబ్ జాదా ఫర్హాన్ 51 పరుగులతో ఆడుతున్నారు.


More Telugu News