Tejas: మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్‌‍లు.. హెచ్ఏఎల్‌తో రక్షణ శాఖ ఒప్పందం

Tejas to Replace MiG21 Jets Defense Deal with HAL
  • రూ. 62,370 కోట్లతో 97 తేజస్ విమానాల కొనుగోలుకు సంబంధించి ఒప్పందం
  • సమీకరిస్తున్న 97 విమానాల్లో 68 యుద్ధ విమానాలు, 29 ట్విన్ సీటర్లు
  • 2027-28 నుంచి వీటి సేకరణ ప్రారంభమవుతుందని రక్షణ శాఖ వెల్లడి
భారత వాయుసేనలో తేజస్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. రక్షణ శాఖ... దశాబ్దాలుగా కీలక సేవలు అందించిన మిగ్-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలికి వాటి స్థానంలో తేజస్ జెట్లను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో రూ. 62,370 కోట్లతో 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన నెలలోపే ఈ ఒప్పందం ఖరారైంది.

మిగ్-21 యుద్ధ విమానాల స్థానంలో ఈ సింగిల్ ఇంజిన్ ఎంకే-1ఏ తేజస్ జెట్‌లను ప్రవేశపెడుతున్నారు. తాజాగా సమీకరిస్తున్న 97 విమానాల్లో 68 యుద్ధ విమానాలు, 29 ట్విన్ సీటర్ ట్రైనర్ జెట్లు ఉండనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. ఈ అత్యాధునిక ఫైటర్ జెట్‌లలో ఉత్తమ్ ఏఈఎస్ఏ రాడార్, స్వయం రక్షా కవచ్ వ్యవస్థలతో పాటు కంట్రోల్ యాక్యుయేటర్‌లు ఉంటాయి. వీటిలో 64 శాతానికి పైగా దేశీయ కంటెంట్, 67 దేశీయ ఉత్పత్తులు ఉండనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.

2027-28 నుండి వీటి సేకరణ ప్రారంభమవుతుందని, తద్వారా వాయుసేన సామర్థ్యాలు పెరగడంతో పాటు ఆత్మనిర్భర్ భారత్, భారత రక్షణ సంసిద్ధతలను మరింత పెంపొందిస్తుందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు రాబోయే ఆరేళ్లలో ఏడాదికి 11,750 ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా.
Tejas
Tejas fighter jets
MiG-21 replacement
Hindustan Aeronautics Limited
HAL
Indian Air Force

More Telugu News