కిరాతకం.. నోట్లో రాయి పెట్టి, మూతికి జిగురు అతికించి అడవిలో పసికందు

  • రాజస్థాన్‌లో వెలుగు చూసిన అమానవీయ ఘటన
  • 15 రోజుల పసిపాపను అడవిలో వదిలేసిన దుండగులు
  • నోట్లో రాయి, మూతికి జిగురు పెట్టి అత్యంత కిరాతకం
  • చిన్నారిని గుర్తించి కాపాడిన పశువుల కాపరి
  • ఆసుప‌త్రిలో చికిత్స, నిలకడగా పాప ఆరోగ్యం
  • తల్లిదండ్రుల కోసం గాలిస్తున్న పోలీసులు
రాజస్థాన్‌లో సభ్య సమాజం తలదించుకునే అమానవీయ ఘటన వెలుగుచూసింది. 15 రోజుల పసికందు నోట్లో రాయి పెట్టి, మూతికి జిగురు అతికించి అడవిలో పడేసి ప్రాణాలు తీయాలని చూశారు. అయితే, ఓ పశువుల కాపరి ఆ చిన్నారిని గుర్తించి ప్రాణాలు కాపాడాడు. పాప తల్లిదండ్రులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా అటవీ ప్రాంతంలో పశువులను మేపుతున్న ఓ కాపరికి పొదల మధ్య నుంచి ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా, రాళ్ల మధ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పసిపాప కనిపించింది. ఆ చిన్నారి అరవకుండా నోటికి జిగురు అంటించి ఉండటాన్ని ఆయన గమనించాడు. వెంటనే ఆ జిగురును తొలగించగా, నోట్లో రాయి ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు.

ఊపిరాడకుండా చేసి చంపేయాలనే దురుద్దేశంతోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని భావించిన ఆయన, వెంటనే ఆ రాయిని బయటకు తీశాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పసికందును ఎత్తుకుని సమీపంలోని ప్రభుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లాడు. వైద్యులు వెంటనే చికిత్స అందించడంతో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాప తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఆసుప‌త్రుల్లో గత 15 రోజుల్లో జరిగిన ప్రసవాల వివరాలను సేకరించి విచారణ జరుపుతున్నారు.


More Telugu News