ఐసీసీ ర్యాంకింగ్స్ లో స్మృతి మంధనే 'టాప్'!

  • మహిళల క్రికెట్‌లో మంధన హవా.. నంబర్ 1 ర్యాంకు పదిలం!
  • కెరీర్‌లో అత్యధికంగా 818 రేటింగ్ పాయింట్లు సాధించిన భారత స్టార్
  • బ్యాటింగ్ జాబితాలో 18వ స్థానానికి చేరిన భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధన తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుస సెంచరీలతో అద్భుత ఫామ్ కనబరిచిన మంధన, తన కెరీర్‌లోనే అత్యధికంగా 818 రేటింగ్ పాయింట్లను సాధించి నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. 

మరోవైపు, దక్షిణాఫ్రికా బ్యాటర్ తజ్మిన్ బ్రిట్స్ ఈ ర్యాంకింగ్స్‌లో సంచలనం సృష్టించింది. పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో అజేయంగా 171 పరుగుల కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఆమె, ఏకంగా 15 స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంకుకు చేరుకుంది. భారత్‌తో జరిగిన మూడో వన్డేలో మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ బెత్ మూనీ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని మూడో ర్యాంకును కైవసం చేసుకుంది.

ఇతర క్రీడాకారిణుల ప్రదర్శన కూడా వారి ర్యాంకులపై ప్రభావం చూపింది. పాకిస్థాన్ బ్యాటర్ సిద్రా అమీన్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 13వ స్థానానికి చేరుకోగా... భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఆరు స్థానాలు ఎగబాకి 18వ ర్యాంకులో నిలిచింది. 

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మరిజాన్నే కాప్ బ్యాటింగ్ జాబితాలో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని తొమ్మిదో ర్యాంకుకు రాగా, ఆల్‌రౌండర్ల జాబితాలో ఒక స్థానం పైకి వచ్చి రెండో ర్యాంకులో నిలిచింది. ఆల్‌రౌండర్ల విభాగంలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆష్లీ గార్డనర్‌కు ఆమె కేవలం కొద్ది పాయింట్ల దూరంలోనే ఉంది.




More Telugu News