ఈపీఎఫ్ఓలో కీలక సంస్కరణలు.. మరింత వేగంగా పీఎఫ్ క్లెయిమ్‌ల పరిష్కారం!

  • ఈపీఎఫ్ఓ సభ్యుల కోసం 'పాస్‌బుక్ లైట్' సదుపాయం ప్రారంభం
  • ఇక ఒకే లాగిన్‌తో పాస్‌బుక్ వివరాల సులభ తనిఖీ
  • పీఎఫ్ బదిలీ పత్రం 'అనెక్చర్-కె నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు
  • క్లెయిమ్‌ల పరిష్కారానికి సరళీకృత ఆమోద ప్రక్రియ
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. ఇకపై పీఎఫ్ పాస్‌బుక్ వివరాలను మరింత సులభంగా తెలుసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు 'పాస్‌బుక్ లైట్' పేరుతో ఈపీఎఫ్ఓ ఒక నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త విధానాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు.

ఇంతకాలం పీఎఫ్ సభ్యులు తమ పాస్‌బుక్ వివరాలను తెలుసుకోవాలంటే మెంబర్ పోర్టల్‌లో లాగిన్ అయి, అక్కడి నుంచి ప్రత్యేకంగా పాస్‌బుక్ పోర్టల్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఈ ప్రక్రియను సులభతరం చేస్తూ, ఇప్పుడు మెంబర్ పోర్టల్‌లోనే నేరుగా 'పాస్‌బుక్ లైట్' ద్వారా తమ కంట్రిబ్యూషన్లు, విత్‌డ్రాయల్స్, బ్యాలెన్స్ వంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకోవచ్చు. అయితే, గ్రాఫికల్ డిస్‌ప్లేతో కూడిన పూర్తిస్థాయి పాస్‌బుక్ కోసం పాత పోర్టల్ కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

దీంతో పాటు, ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతా బదిలీకి సంబంధించిన 'అనెక్చర్-కె' (ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్)ను ఇకపై సభ్యులు నేరుగా మెంబర్ పోర్టల్ నుంచి పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించారు. గతంలో ఈ పత్రాన్ని కేవలం పీఎఫ్ కార్యాలయాల మధ్య మాత్రమే పంచుకునేవారు. ఈ నూతన విధానంతో పీఎఫ్ బదిలీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత వస్తుందని, తమ బ్యాలెన్స్, సర్వీస్ కాలాన్ని సరిగ్గా బదిలీ చేశారో లేదో సభ్యులు సులభంగా నిర్ధారించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

మరో ముఖ్యమైన సంస్కరణలో భాగంగా, పీఎఫ్ క్లెయిమ్‌ల ఆమోద ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. గతంలో పీఎఫ్ బదిలీలు, సెటిల్‌మెంట్లు, అడ్వాన్సుల వంటివాటికి ఉన్నతాధికారుల నుంచి పలు దశల్లో ఆమోదం అవసరం కావడంతో జాప్యం జరిగేది. ఇప్పుడు ఈ ఆమోద ప్రక్రియను సరళీకృతం చేసి, క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు వీలు కల్పించారు. దీనివల్ల సభ్యులకు సేవలు త్వరగా అందడంతో పాటు, క్షేత్రస్థాయి కార్యాలయాల్లో జవాబుదారీతనం పెరుగుతుందని అధికారులు వివరించారు. మొత్తంగా ఈ నూతన సంస్కరణలన్నీ సభ్యుల సౌలభ్యం, పారదర్శకత, సంతృప్తిని పెంచడమే లక్ష్యంగా ప్రవేశపెట్టినట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది.


More Telugu News