Mithun Reddy: లిక్కర్ కేసు... మిథున్ రెడ్డిని సిట్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్‌రెడ్డిని రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను మరింత లోతుగా జరిపేందుకు నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సిట్ ఐదు రోజుల పాటు కస్టడీకి కోరితే... కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది.

కోర్టు అనుమతితో, సిట్ అధికారులు మిథున్‌రెడ్డిని శుక్ర, శనివారాల్లో తమ అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించవచ్చని కోర్టు తెలిపింది. ఈ రెండు రోజుల విచారణలో మద్యం కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో మిథున్‌రెడ్డి పాత్ర, ఇతర నిందితులతో ఉన్న సంబంధాలపై ప్రధానంగా దృష్టి సారించి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.

గత కొద్ది రోజులుగా ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన సిట్, మిథున్‌రెడ్డిని విచారించడం ద్వారా మరిన్ని ఆధారాలు సేకరించవచ్చని భావిస్తోంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో, నిందితుడిని కస్టడీకి తీసుకుని విచారణ జరిపేందుకు సిట్ బృందం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విచారణ అనంతరం కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Mithun Reddy
Liquor Case
Andhra Pradesh Liquor Scam
Vijayawada ACB Court
Special Investigation Team SIT
Excise Department
Liquor Investigation
AP News
Crime News

More Telugu News