Sovereign Gold Bond: ఆ గోల్డ్ బాండ్ మీ దగ్గర ఉందా?.. అయితే మీకు పండగే..!

Sovereign Gold Bond SGB Series IV Redemption Price Announced
  • 2019-20 గోల్డ్ బాండ్ సిరీస్-IV ముందస్తు విమోచన ధర ప్రకటన
  • గ్రాముకు రూ. 11,003గా ధరను నిర్ణయించిన ఆర్బీఐ
  • అప్పట్లో గ్రాముకు రూ. 3840కే కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు
  • ఐదేళ్ల కాలంలోనే 186 శాతం మేర భారీ ప్రతిఫలం
  • పెట్టుబడిపై ఏటా 2.50 శాతం వడ్డీ అదనం
సావరిన్ గోల్డ్ బాండ్లలో (ఎస్‌జీబీ) పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని లాభాలు అందుతున్నాయి. ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన ఓ సిరీస్ బాండ్లపై ఏకంగా 186 శాతం ప్రతిఫలం వస్తుండటంతో ఇన్వెస్టర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ముందస్తు విమోచన ధరను ఆర్బీఐ ఈ రోజు ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే.. 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన సావరిన్ గోల్డ్ బాండ్ సిరీస్-IVకు సంబంధించి ముందస్తు విమోచన (ప్రీ-మెచ్యూర్ రిడెంప్షన్) ధరను ఆర్బీఐ ఖరారు చేసింది. 2019 సెప్టెంబర్‌లో జారీ చేసిన ఈ బాండ్లను ఇప్పుడు గ్రాముకు రూ. 11,003 చొప్పున వెనక్కి తీసుకుని నగదు పొందవచ్చని తెలిపింది.

అప్పట్లో ఈ బాండ్ల ఇష్యూ ధర గ్రాముకు రూ. 3,890గా ఉండగా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి డిజిటల్ పద్ధతిలో చెల్లించిన వారికి రూ. 50 తగ్గింపుతో రూ. 3,840కే లభించింది. ప్రస్తుత విమోచన ధరతో పోల్చి చూస్తే, డిస్కౌంట్‌తో కొనుగోలు చేసిన వారికి ప్రతి గ్రాముపై ఏకంగా రూ. 7,163 లాభం వచ్చినట్లయింది. అంటే ఐదేళ్లలోనే దాదాపు 186 శాతం ప్రతిఫలం అందుకుంటున్నారు. ఈ భారీ లాభంతో పాటు ఏటా 2.50 శాతం చొప్పున వడ్డీ కూడా అదనంగా లభిస్తుంది.

సాధారణంగా గోల్డ్ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే, బాండ్లు జారీ చేసిన ఐదేళ్లు పూర్తయిన తర్వాత ముందస్తుగా డబ్బులు తీసుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పిస్తోంది. ఈ సిరీస్ బాండ్లను 2019 సెప్టెంబర్ 17న జారీ చేయగా, సరిగ్గా ఐదేళ్లు పూర్తవడంతో 2025 సెప్టెంబర్ 17 నుంచి రిడీమ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. గత మూడు బిజినెస్ డేస్‌ (సెప్టెంబర్ 12, 15, 16) ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకటించిన బంగారం సగటు ధర ఆధారంగా ఆర్బీఐ ఈ విమోచన ధరను ఖరారు చేసింది.
Sovereign Gold Bond
Gold Bond
RBI
Gold investment
Investment returns
Gold prices
Premature redemption
SGB Series IV
Indian Bullion and Jewellers Association
IBJA

More Telugu News