నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు... ఆర్థిక మంత్రిని వీధుల్లో తరుముతూ కొట్టిన నిరసనకారులు

  • నేపాల్‌లో మంత్రులపై భౌతిక దాడులు
  • ఆర్థిక మంత్రిని వీధుల్లో తరిమి కొట్టిన నిరసనకారులు
  • మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాపై కూడా దాడి
  • విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబాపైనా చేయిచేసుకున్న ఆందోళనకారులు
  • దేశంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఘటనలు
నేపాల్‌లో రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ప్రజల నిరసనలు హింసాత్మకంగా మారి ఏకంగా మంత్రులపై దాడులకు దారితీశాయి. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్‌పై ఆందోళనకారులు దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిరసనకారులు ఆయన్ను వీధుల్లో వెంబడించి కొట్టడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘటనతో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. మంత్రులపై దాడులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్ వారికి కనిపించడంతో ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఆయన వీధుల్లో పరుగెడుతుండగా ఆందోళనకారులు దాడి చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఆయన పరుగెడుతుండగా ఎదురుగా వచ్చిన ఒక యువకుడు ఎగిరి తన్నిన దృశ్యం కూడా వీడియోలో కనిపించింది. నిరసనకారుల నుంచి తప్పించుకోవడానికి మంత్రి మళ్లీ లేచి పరుగెత్తారు.

ఈ దాడులు ఆర్థిక మంత్రికే పరిమితం కాలేదు. నేపాల్ మాజీ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా, ఆయన భార్య, ప్రస్తుత విదేశాంగ శాఖ మంత్రి అర్జు రాణా దేవుబాలను కూడా నిరసనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. వీరిపై కూడా ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు.

Bishnu Prasad Paudel
Nepal protests
Nepal economic crisis
Bishnu Prasad Paudel attack

More Telugu News