క్రికెటర్లకు బ్రాంకో టెస్టు సరైంది కాదా? బీసీసీఐ వెనుకంజ!

  • క్రికెట్ లో వివాదాస్పదంగా మారిన బ్రాంకో టెస్టు
  • ఫిట్‌నెస్ టెస్టులు కాలానుగుణంగా మారుతాయిన్న స్ట్రెంత్ అండ్ కండీషనింగ్‌ మాజీ కోచ్ సోహమ్ దేశాయ్ 
  • యోయో టెస్టు వంటి పరీక్షలు జట్టు ఎంపికకు ప్రమాణం కాదన్న సోహమ్
భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ పరీక్షల విషయంలో బీసీసీఐ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా వివాదాస్పదంగా మారిన బ్రాంకో టెస్టును ఇకపై తప్పనిసరి చేయకూడదని బీసీసీఐ వర్గాల చర్చల ద్వారా తెలుస్తోంది. ఆటగాళ్ల నుంచి వ్యతిరేకత, విమర్శలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

బ్రాంకో టెస్టు - క్రికెటర్లకు ఎందుకు సరికాదని విమర్శలు?

బ్రాంకో టెస్టు రగ్బీ వంటి కఠినమైన క్రీడల కోసం రూపొందించిన పద్ధతి. ఇది ఆటగాడి స్టెమినా, కార్డియో ఫిట్‌నెస్‌ను అంచనా వేస్తుంది. అయితే ఇది క్రికెట్‌కు పూర్తిగా సరిపోదని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లు మైదానంలో 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్ల దూరాలు పరుగు తీయాల్సి ఉంటుంది. క్రికెట్‌లో ఉండే కదలికలకు ఇది తగినది కాదని విమర్శలు వచ్చాయి. ఈ పరీక్షను తీసుకురావడం వెనుక సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మను లక్ష్యంగా చేసుకోవడమే కారణమనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

యోయో టెస్టు కొనసాగుతుందా?

బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం క్రికెటర్ల ఫిట్‌నెస్‌ను అంచనా వేయడానికి యోయో టెస్టునే ప్రాధాన్యంగా కొనసాగిస్తున్నారు. బ్రాంకో టెస్టుపై వ్యతిరేకత ఉండటంతో ఆసియా కప్ ముందు దానిని అమలు చేయకపోవచ్చు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఆసియా కప్ టూర్ కోసం టీమ్ ఇండియా

భారత జట్టు సెప్టెంబర్ 4న దుబాయ్‌కు బయలుదేరనుంది. ఆటగాళ్లు అక్కడే కలుసుకొని సెప్టెంబర్ 5న ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. అయితే మేనేజ్‌మెంట్ అనుమతిస్తే, సాధారణ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

"పరీక్షలు మారతాయి, ఎంపికకు ప్రమాణం కాదు" - సోహమ్ దేశాయ్

ఈ విషయంపై స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ మాజీ కోచ్ సోహమ్ దేశాయ్ స్పందిస్తూ, "ఫిట్‌నెస్ పరీక్షలు కాలానుగుణంగా మారుతాయి. యోయో టెస్టు వంటి పరీక్షలు జట్టు ఎంపికకు ప్రమాణం కాదు. ఇవి కేవలం ఆటగాళ్ల ఫిట్‌నెస్ స్థాయిని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి" అని అన్నారు. 


More Telugu News