హైదరాబాద్ గణేశ్ నిమజ్జనానికి హాజరుకానున్న అమిత్ షా
- హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి
- విమానాశ్రయం నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్కు చేరుకోనున్న అమిత్ షా
- హోటల్లో బీజేపీ ముఖ్య నేతలు, భాగ్యనగర్ ఉత్సవ సమితితో భేటీ కానున్న అమిత్ షా
సెప్టెంబర్ 6న మధ్యాహ్నం 1.10 గంటలకి ప్రత్యేక విమానంలో అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్కు చేరుకుని భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై ఆరా తీయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల వరకు భాగ్యనగర్ ఉత్సవ సమితి 46 ఏళ్ల ప్రయాణంపై ఐటీసీ కాకతీయలో ఏర్పాటు చేసే ఫొటో ఎగ్జిబిషన్ను అమిత్ షా ప్రారంభిస్తారు. కమిటీ సభ్యులతో గ్రూప్ ఫొటో దిగుతారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎస్ఎస్బీ 28వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్కి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఐటీసీ కాకతీయ నుంచి సాయంత్రం నాలుగు గంటలకు మొజంజాహీ మార్కెట్ వినాయక చౌక్కు చేరుకుంటారు. అక్కడ గణనాథులకు స్వాగతం పలకడంతో పాటు గణేశ్ శోభాయాత్రను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.