తెలంగాణకు మరో భారీ పరిశ్రమ.. నిజామాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎఫ్‌వోఎస్ ప్లాంట్

  • రివిలేషన్స్‌ బయోటెక్‌ ఆధ్వర్యంలో యూనిట్ నిర్మాణం
  • ఏటా 20 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం
  • 2027 ఆగస్టు నాటికి పూర్తి.. 700 మందికి ఉపాధి
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త సహకారం
  • 'మేక్ ఇన్ ఇండియా'కు ప్రోత్సాహం
  • దిగుమతులపై ఆధారపడటం తగ్గింపు
తెలంగాణ పారిశ్రామిక రంగంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రక్టో ఒలిగో శాకరాయిడ్స్‌ (ఎఫ్‌వోఎస్‌) తయారీ యూనిట్‌కు నిజామాబాద్‌ కేంద్రంగా మారింది. రివిలేషన్స్‌ బయోటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ మెగా ఫుడ్‌ పార్క్‌లో ఈ భారీ పరిశ్రమ రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే భారత బయోటెక్నాలజీ, ఆహార ప్రాసెసింగ్‌ రంగాలు మరింత బలోపేతం కానున్నాయి.

సంవత్సరానికి 20 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ యూనిట్‌ 2027 ఆగస్టు నాటికి కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి, పరోక్షంగా మరో 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ) ఆర్థిక సహాయం అందిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం కూడా అవసరమైన సహకారాన్ని అందిస్తోంది. ఇప్పటికే రివిలేషన్స్‌ బయోటెక్‌, బీఐఆర్‌ఏసీ మధ్య ఒప్పందం కూడా కుదిరింది.

నిజామాబాదే ఎందుకు?
ఎఫ్‌వోఎస్‌ తయారీకి చక్కెర ప్రధాన ముడిపదార్థం. తెలంగాణలో నిజామాబాద్‌ ప్రాంతం చెరుకు సాగుకు, చక్కెర ఉత్పత్తికి ప్రసిద్ధి. ఇక్కడ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక చెరుకు రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుందని, వారికి స్థిరమైన మార్కెట్ లభిస్తుందని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. దేశంలో పెరుగుతున్న మధుమేహ సమస్యకు చక్కెరకు బదులుగా ఆరోగ్యకరమైన ఎఫ్‌వోఎస్‌ ఒక మంచి పరిష్కారమని ఆయన తెలిపారు.

ఎఫ్‌వోఎస్‌ అనేది సహజసిద్ధమైన ప్రీబయాటిక్‌. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. దీన్ని న్యూట్రాసూటికల్స్‌, ఫంక్షనల్‌ బేవరేజెస్‌ వంటి ఉత్పత్తుల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. రివిలేషన్స్‌ బయోటెక్‌ సంస్థ తన ప్రత్యేకమైన, పర్యావరణహిత టెక్నాలజీతో దీనిని ఉత్పత్తి చేయనుంది. ఇప్పటికే ఈ సంస్థ 'స్వీట్‌ స్పాట్‌' బ్రాండ్‌ పేరుతో ఎఫ్‌వోఎస్‌ను రిటైల్‌ మార్కెట్లో విక్రయిస్తోంది.

ఈ యూనిట్‌ భారత బయోటెక్నాలజీ ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. "ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వ 'మేక్‌ ఇన్‌ ఇండియా' లక్ష్యానికి అనుగుణంగా ఉంది. దీని ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గడమే కాకుండా, భవిష్యత్తులో భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద ఎఫ్‌వోఎస్‌ ఎగుమతిదారుగా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ఆయన అన్నారు.


More Telugu News