Narendra Modi: భూకంపంతో అతలాకుతలమైన ఆప్ఘనిస్థాన్ కు మోదీ ఆపన్న హస్తం

ఆప్ఘనిస్థాన్‌లో సంభవించిన ఘోర భూకంప విపత్తుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో ఆప్ఘన్ ప్రజలకు అండగా నిలుస్తామని, అవసరమైన అన్ని రకాల మానవతా సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషాద ఘటనలో కుటుంబ సభ్యులను, ఆప్తులను కోల్పోయిన వారికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని తన సందేశంలో పేర్కొన్నారు.

ఆదివారం అర్ధరాత్రి 11:47 గంటల సమయంలో ఆప్ఘనిస్థాన్‌ను 6.0 తీవ్రతతో భారీ భూకంపం కుదిపేసింది. ఈ ప్రకృతి విలయం కారణంగా ఇప్పటివరకు 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 2500 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ రేడియో టెలివిజన్ ఆప్ఘనిస్థాన్ వెల్లడించింది. భూకంపం ధాటికి అనేక గ్రామాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయని, శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో, బాధితుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తాలిబన్ ప్రభుత్వం సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతోందని ఆమె ఆరోపించారు. మానవతా సంస్థలు, అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Narendra Modi
Afghanistan earthquake
India Afghanistan relations
earthquake relief
humanitarian aid
Taliban government
Zarifa Ghafari
earthquake Afghanistan 2024
natural disaster
international aid

More Telugu News