చిరు వ్యాపారికి రూ.141 కోట్ల షాక్.. పాన్ కార్డుతో భారీ మోసం!

  • చిరు వ్యాపారికి రూ.141 కోట్లకు పైగా అమ్మకాలపై ఐటీ నోటీసులు
  • తన పాన్ కార్డును దుర్వినియోగం చేశారని బాధితుడి ఆరోపణ
  • ఢిల్లీలో తన పేరుపై ఆరు కంపెనీలు ఏర్పాటు చేసిన మోసగాళ్లు
  • 2022లోనే తొలిసారి నోటీసులు వచ్చాయని వెల్లడించిన బాధితుడు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఓ చిన్న కిరాణా దుకాణం నడుపుకునే వ్యక్తికి ఆదాయ పన్ను (ఐటీ) శాఖ నుంచి ఊహించని షాక్ తగిలింది. ఏకంగా రూ. 141 కోట్లకు పైగా అమ్మకాలు జరిపినట్లు ఆయనకు నోటీసులు అందాయి. తన పాన్ కార్డును ఎవరో దుర్వినియోగం చేసి ఈ భారీ మోసానికి పాల్పడ్డారని బాధితుడు వాపోతున్నాడు.

వివరాల్లోకి వెళితే.. ఖుర్జాలోని నయాగంజ్ ప్రాంతానికి చెందిన సుధీర్ అనే వ్యక్తి తన ఇంట్లోనే ఓ చిన్న కిరాణా దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, ఆయన పేరు మీద ఢిల్లీలో ఆరు కంపెనీలు రిజిస్టర్ అయినట్లు, వాటి ద్వారా రూ. 141,38,47,126 విలువైన అమ్మకాలు జరిగినట్లు ఐటీ శాఖ నుంచి ఆయనకు నోటీసులు వచ్చాయి. ఇది చూసి సుధీర్ కంగుతిన్నారు.

ఈ విషయంపై సుధీర్ మాట్లాడుతూ.. "ఈ ఏడాది జులై 10న నాకు ఐటీ శాఖ నుంచి నోటీసు వచ్చింది. నేను రూ. 141 కోట్లకు పైగా అమ్మకాలు జరిపినట్లు అందులో ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను" అని తెలిపారు. తనకు 2022లోనే తొలిసారి నోటీసు వచ్చిందని, అప్పుడే ఐటీ అధికారులను కలిసి ఆ కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించినట్లు ఆయన చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తులు తన పాన్ కార్డును మోసపూరితంగా ఉపయోగించి ఈ కంపెనీలను సృష్టించారని ఆయన ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

పాన్ కార్డు మోసాలు ఇలా..
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఇతరుల పాన్ కార్డు వివరాలను అక్రమంగా సంపాదించి వాటి ద్వారా బ్యాంకు ఖాతాలు తెరవడం, డొల్ల కంపెనీలు సృష్టించడం, రుణాలు పొందడం లేదా పన్నులు ఎగవేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి మోసాల బారిన పడిన బాధితులకు ఐటీ నోటీసులు లేదా లోన్ రికవరీ కాల్స్ వచ్చినప్పుడు మాత్రమే విషయం తెలుస్తోంది. ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని, క్రెడిట్ రిపోర్టులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


More Telugu News