భార్య హసీన్ జహాన్‌తో వివాదంపై మౌనం వీడిన షమీ

  • గతం గురించి తాను బాధపడనన్న షమీ
  • ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదని వ్యాఖ్య
  • వివాదాలు తనకు అవసరం లేదని వెల్లడి
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా భార్య హసీన్ జహాన్‌తో కొనసాగుతున్న వివాదంపై ఎట్టకేలకు స్పందించారు. గడిచిన కొన్నేళ్లుగా తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన తొలిసారిగా పెదవి విప్పారు. గతాన్ని తాను పట్టించుకోనని, తన పూర్తి ఏకాగ్రత క్రికెట్ కెరీర్‌పైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితంపై అడిగిన ప్రశ్నకు షమీ ప్రశాంతంగా సమాధానమిచ్చారు. "ఆ విషయాన్ని వదిలేయండి. గతం గురించి నేను ఎప్పుడూ బాధపడను. జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయంలో ఎవరినీ నిందించాలని నేను అనుకోవడం లేదు. కనీసం నన్ను నేను కూడా నిందించుకోను. నేను నా క్రికెట్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ వివాదాలు నాకు అవసరం లేదు" అని ఆయన తేల్చి చెప్పారు. 

2014లో హసీన్ జహాన్‌ను వివాహం చేసుకున్న షమీ, నాలుగేళ్లకే ఆమె నుంచి విడిపోయారు. 2018 నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అప్పటి నుంచి షమీపైనా, ఆయన కుటుంబంపైనా హసీన్ జహాన్ పలుమార్లు తీవ్ర ఆరోపణలు చేశారు. గృహ హింస, మానసిక వేధింపులకు గురిచేశారంటూ ఆమె ఆరోపించడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నెల మొదట్లో కూడా షమీని ఒక "విమెనైజర్" అని విమర్శిస్తూ, సొంత కూతురిని కాదని గర్ల్‌ఫ్రెండ్స్ పిల్లలకు ఖరీదైన బహుమతులు ఇస్తున్నాడని ఆమె ఆరోపించారు.

ఇక క్రికెట్ విషయానికొస్తే, షమీ ప్రస్తుతం తన ఆటపై దృష్టి సారించారు. బెంగళూరులో జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆయన ఆడుతున్నారు. అయితే, ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన షమీ... 9 మ్యాచ్‌లలో కేవలం 6 వికెట్లు మాత్రమే తీసి నిరాశపరిచారు. ఫామ్ కోల్పోవడం వల్లే ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో పాటు, రాబోయే ఆసియా కప్ 2025 టోర్నీకి కూడా ఆయన ఎంపిక కాలేదు.


More Telugu News