నా రిటైర్మెంట్‌తో ఎవరికి లాభం?.. విసుగుపుడితే నేనే తప్పుకుంటా.. షమీ ఘాటు వ్యాఖ్యలు

  • ఇప్పుడే రిటైరయ్యే ప్రసక్తే లేదన్న షమీ
  • దేశవాళీ క్రికెట్ ఆడి జట్టులోకి వస్తానని ధీమా
  • 2027 ప్రపంచకప్ గెలవడమే తన ఏకైక లక్ష్యమని వ్యాఖ్య 
  • గత రెండు నెలలుగా కఠోర సాధన చేస్తున్నట్లు వెల్లడి
  • 2023 ప్రపంచకప్ ఫైనల్ ఓటమిపై ఆవేదన
టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు ఘాటుగా స్పందించాడు. తనలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉందని, ఇప్పుడే ఆటకు వీడ్కోలు పలికే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. ఆసియా కప్‌కు ఎంపిక కాకపోవడంతో తన భవిష్యత్తుపై నెలకొన్న సందేహాలను పటాపంచలు చేస్తూ దేశవాళీ క్రికెట్‌లో రాణించి తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

ఇటీవల ఓ క్రీడా చానల్‌తో మాట్లాడిన షమీ తన రిటైర్మెంట్‌ను కోరుకుంటున్న వారిని ఉద్దేశించి సూటిగా ప్రశ్నించాడు. "నా రిటైర్మెంట్‌తో ఎవరి జీవితం బాగుపడుతుంది? నేను ఎవరికి అడ్డుగా ఉన్నాను? ఆటపై నాకు విసుగు పుట్టిన రోజు నేనే తప్పుకుంటాను. మీరు నన్ను జట్టులోకి తీసుకోకపోయినా, నేను కష్టపడటం ఆపను. అంతర్జాతీయ క్రికెట్‌లో కాకపోతే దేశవాళీలో ఆడతాను. ఏదో ఒకచోట ఆడుతూనే ఉంటాను. నాకింకా ఆ సమయం రాలేదు" అని అన్నాడు.

2027 వన్డే ప్రపంచకప్‌ను గెలవడమే తన ఏకైక కల అని షమీ ఉద్వేగంగా చెప్పాడు. "నాకు ఆ ఒక్క కల మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచకప్‌ను గెలిచే జట్టులో భాగమై కప్‌ను స్వదేశానికి తీసుకురావాలి. 2023లో మేము కప్‌కు చాలా దగ్గరగా వచ్చాం. వరుస విజయాలతో ఫైనల్‌కు చేరినా ఫైనల్‌లో ఓటమి చెందాం. అభిమానుల ప్రోత్సాహం మాలో ఎంతో స్ఫూర్తిని నింపింది. కానీ ఆ కల నెరవేరడం బహుశా నా అదృష్టంలో లేదు" అని 2023 ఫైనల్ ఓటమిని గుర్తుచేసుకుని ఆవేదన వ్యక్తం చేశాడు.

గత రెండు నెలలుగా తన ఫిట్‌నెస్‌, నైపుణ్యాలపై తీవ్రంగా శ్రమిస్తున్నట్లు షమీ తెలిపాడు. బరువు తగ్గించుకోవడం, బౌలింగ్‌లో లోడ్ పెంచడం వంటి అంశాలపై దృష్టి సారించానని, ఇప్పుడు పూర్తిస్థాయిలో బౌలింగ్ చేయగలనని చెప్పాడు. గతంలో గాయాల కారణంగా ఎదురైన ఇబ్బందుల నుంచి పాఠాలు నేర్చుకున్నానని, అందుకే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే ముందు కాస్త అసౌకర్యంగా అనిపించడంతోనే తప్పుకున్నానని వివరించాడు. 


More Telugu News