సినీ కార్మికుల వేతనంపై కీలక అప్ డేట్

  • ఫిల్మ్‌ ఫెడరేషన్‌కి చెందిన ఏడు యూనియన్లతో మరోసారి సమావేశమైన ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు
  • వేతనాల పెంపుకు హామీ ఇచ్చారన్న అనిల్ వల్లభనేని
  • తెలంగాణను సినిమా హబ్‌గా మారుస్తామని ప్రకటించినందునే సీఎం ఫోటోకు క్షీరాభిషేకం చేశామని వివరణ   
తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల వేతనాల పెంపు అంశంపై చర్చలు ఊపందుకున్నాయి. సినీ కార్మికుల వేతన పెంపు డిమాండ్‌పై ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు, ఫిల్మ్‌ ఫెడరేషన్‌కు చెందిన ఏడు యూనియన్లతో నిన్న మరోసారి కీలక సమావేశం నిర్వహించారు. చర్చల సమయంలో 9 టు 9 కాల్‌షీట్‌ విధానంపై కూడా ప్రస్తావన వచ్చింది. ఈ విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదనపై ఫెడరేషన్‌ నేతలను ఒప్పించేందుకు ఫిల్మ్‌ ఛాంబర్‌ యత్నించినట్టు సమాచారం.

సమావేశం అనంతరం ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ అనిల్ వల్లభనేని మీడియాతో మాట్లాడుతూ.. "ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు మా సమస్యలను గమనించారు. వేతన శాతం పెంచుతామని హామీ ఇచ్చారు. మూడు యూనియన్లకు కూడా వేతన పెంపు వర్తింపజేస్తామని తెలిపారు. బుధవారం ఉదయం నిర్మాతలతో మరోసారి చర్చించి, సాయంత్రం అధికారిక ప్రకటన చేస్తారు’' అని వివరించారు.

చర్చల వివరాలను నటుడు చిరంజీవికి ఫోన్ ద్వారా తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణను సినిమా హబ్‌గా మారుస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఫోటోకు క్షీరాభిషేకం చేశామని తెలిపారు. సినీ పరిశ్రమలో కార్మికుల హక్కుల కోసం ఈ చర్చలు కీలక మలుపు తీసుకున్నాయి. ఈ రోజు వెలువడే నిర్ణయంపై పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. 


More Telugu News