శ్రీహరి దానం చేశాడు .. మమ్మల్ని కొందరు మోసం చేశారు: డిస్కో శాంతి!

  • శ్రీహరికి ధైర్యం ఎక్కువన్న శాంతి 
  • రిస్కీ ఫైట్లు చేసేవారని వెల్లడి 
  • ఆయన చనిపోయాక ఇబ్బందులు పడ్డామని వివరణ 
  • కొన్ని ఆస్తులు చేజారాయని ఆవేదన

తెలుగు తెరపై తెలంగాణ ప్రాంతానికి చెందిన నటుడిగా శ్రీహరికి ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. విలన్ గా .. కేరక్టర్ ఆర్టిస్టుగా .. యాక్షన్ హీరోగా ఆయన రాణించారు. అలాంటి శ్రీహరి ఆ మధ్య అనారోగ్య కారణాల వలన చనిపోయారు. ఆయన గురించి తాజాగా 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'డిస్కో శాంతి' ప్రస్తావించారు. "శ్రీహరిని నేను బావా అని పిలిచేదానిని. ఆయనకి ధైర్యం చాలా ఎక్కువ. దేనికీ భయపడేవారు కాదు" అని అన్నారు. 

"సినిమాలలో యాక్షన్ సన్నివేశాలలో డూప్ లేకుండా చేసేవారు. నేను సెట్ కి వస్తున్నానని  తెలిస్తే, ముందుగానే రిస్కీ షాట్లు తీసేయమని డైరెక్టర్ తో చెప్పేవారు. ఒకసారి ఒక డైరెక్టర్ ఆయనను పెద్ద బిల్డింగ్ పై నుంచి రెండుసార్లు దూకించాడు. అంతే నేను వెళ్లి ఆ డైరెక్టర్ ను .. ఫైట్ మాస్టర్ ను చీవాట్లు పెట్టాను. అయితే తెరపై ఆయన యాక్షన్ సీన్స్ ను చూస్తూ ఎంజాయ్ చేసే దానిని. చూడటానికి ఆయన అలా కనిపిస్తారు గానీ, సాయం చేసే గుణం ఎక్కువ" అని చెప్పారు. 

"బావ బాగానే సంపాదించారు. అయితే ఆయన చనిపోయిన తరువాత కొందరు మమ్మల్ని మోసం చేశారు. అలా సగం ఆస్తులను కోల్పోయామనే చెప్పాలి. ఆయన బాగా నమ్మిన స్నేహితులే అలా చేశారు. అది ఆస్తులను గురించి ఆలోచన చేసే సమయం కాదు. అందువలన నా నగలు తాకట్టుపెట్టి ఇల్లు గడిచేలా చూశాను. శ్రీహరి చేసిన దానధర్మాలు వలన వచ్చిన పుణ్యమే మమ్మల్ని కాపాడుతుందని నమ్ముతాను. మమ్మల్ని మోసం చేసినవారి సంగతి అంటారా .. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు" అని అన్నారు. 



More Telugu News