Namrata: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు...డాక్టర్ నమ్రత నేరాన్ని అంగీకరించారన్న పోలీసులు

Dr Namrata Admits Guilt in Srushti Fertility Center Case
షార్ట్స్‌లో చూడండి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్‌ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రత, విచారణలో తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సరోగసీ ముసుగులో ఆమె నడిపిన శిశువుల క్రయవిక్రయాల దందాకు సంబంధించిన షాకింగ్ నిజాలు ఆమె వాంగ్మూలంతో బయటపడ్డాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డాక్టర్ నమ్రత ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని ఈ మోసాలకు పాల్పడ్డారు. సికింద్రాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఫెర్టిలిటీ సెంటర్లను నిర్వహిస్తూ, సంతానం లేని దంపతులను లక్ష్యంగా చేసుకున్నారు. సరోగసీ ద్వారా పిల్లలను అందిస్తామని నమ్మించి, వారి నుంచి రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు ఆమె అంగీకరించారు.

ఈ దందా కోసం ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుని, ఆర్థికంగా వెనుకబడిన గర్భిణులను గుర్తించేవారని విచారణలో తేలింది. వారికి డబ్బు ఆశ చూపి, ప్రసవం తర్వాత బిడ్డను తమకు అప్పగించేలా ఒప్పందాలు చేసుకునేవారు. అలా కొనుగోలు చేసిన శిశువులను, తమ వద్దకు వచ్చిన దంపతులకు సరోగసీ ద్వారా జన్మించినట్లుగా నమ్మించి అప్పగించేవారని డాక్టర్ నమ్రత తన నేరాంగీకార పత్రంలో పేర్కొన్నట్లు సమాచారం. 

తనపై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన విషయాన్ని కూడా ఆమె ఒప్పుకున్నారని అధికారులు తెలిపారు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపి, నెట్‌వర్క్‌లోని ఇతర సభ్యులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Go Back to Shorts
Namrata
Srushti Fertility Center
fertility center case
surrogacy racket
baby selling
child trafficking
Hyderabad
Vijayawada
Visakhapatnam
police investigation

More Telugu News