హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం.. హ‌త్య‌

  • ఉప్పల్ ఠాణా పరిధిలో ఘ‌ట‌న‌
  • రామాంతపూర్‌లో నివసిస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దంపతులు
  • ఈ నెల 12న త‌మ ఐదేళ్ల కొడుకు క‌నిపించ‌డంలేద‌ని పోలీసులకు ఫిర్యాదు 
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బీహార్ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • విచార‌ణ‌లో తానే బాలుడిపై అత్యాచారం చేసి, హ‌త్య‌చేసిన‌ట్టు అంగీక‌రించిన స‌ద‌రు వ్య‌క్తి
హైదరాబాద్‌లో దారుణం జ‌రిగింది. ఐదేళ్ల బాలుడిపై ఓ మృగాడు అత్యాచారానికి పాల్పడి, అనంతరం అతడిని హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సంచ‌ల‌నంగా మారింది. ఈ ఘటన ఉప్పల్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

వివ‌రాల్లోకి వెళితే.. రామాంతపూర్‌లో నివసిస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దంపతులు తమ కొడుకు కనిపించడం లేదని ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు స‌మీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. బాధిత‌ కుటుంబానికి స‌మీపంలో ఉంటున్న‌ బీహార్‌కు చెందిన కమర్ అనుమానాస్ప‌దంగా క‌నిపించాడు. దీంతో పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచార‌ణ‌లో అసలు విషయం బయటపడింది.

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేసి అక్కడే హత్య చేసినట్టు నిందితుడు పోలీసుల‌కు వెల్లడించాడు. దీంతో పోలీసులు శుక్రవారం రాత్రి కమర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంత‌రం బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు పోలీసులు వెల్ల‌డించారు.


More Telugu News