రేపు బెంగళూరులో 3 వందే భారత్ రైళ్లు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Narendra Modi to Launch 3 Vande Bharat Trains in Bengaluru
షార్ట్స్‌లో చూడండి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన బెంగళూరు నగర వాసులకు ఒకే రోజు రెండు కీలకమైన కానుకలు అందించనున్నారు. నగరంలో అత్యంత కీలకమైన మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు, మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. 

వివరాల్లోకి వెళితే, ఆదివారం ఉదయం 11 గంటలకు బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని మోదీ 3 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తారు. వీటిలో బెంగళూరు-బెళగావి, అమృత్‌సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, నాగ్‌పూర్ (అజ్ని)-పుణె మార్గాల్లో నడిచే రైళ్లు ఉన్నాయి. బెంగళూరు-బెళగావి రైలుతో, కర్ణాటక రాష్ట్రం నుంచి నడిచే వందే భారత్ రైళ్ల సంఖ్య 11కి పెరిగింది. 

అంతేకాదు... బెంగళూరు-బెళగావి మధ్య ప్రీమియం రైలు సేవలకు సంబంధించి ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరనుంది. ఈ కొత్త రైలుతో ఇరు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట వరకు తగ్గనుంది. ఈ రైలు ఉదయం 5:20 గంటలకు బెళగావిలో బయలుదేరి మధ్యాహ్నం 1:50 గంటలకు కేఎస్ఆర్ బెంగళూరుకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2:20 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి 10:40 గంటలకు బెళగావికి చేరుకుంటుంది. ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ. 1,575 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 2,905గా ఉంది.

రైళ్ల ప్రారంభోత్సవం అనంతరం, మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ పట్టణ కనెక్టివిటీ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తారు. బెంగళూరు మెట్రో రెండో దశలో భాగంగా నిర్మించిన 'ఎల్లో లైన్'ను ఆయన జాతికి అంకితం చేస్తారు. సుమారు రూ. 7,160 కోట్ల వ్యయంతో, 19 కిలోమీటర్ల పొడవున 16 స్టేషన్లతో ఈ మార్గాన్ని నిర్మించారు. ఆర్‌వీ రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మీదుగా బొమ్మసంద్ర వరకు ఈ లైన్ అందుబాటులోకి వస్తుంది. ఈ లైన్ ప్రారంభంతో బెంగళూరులో మొత్తం మెట్రో నెట్‌వర్క్ 96 కిలోమీటర్లకు పైగా విస్తరించనుంది.

అంతేకాకుండా, సుమారు రూ. 15,610 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బెంగళూరు మెట్రో ఫేజ్-3 ప్రాజెక్టుకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 44 కిలోమీటర్ల పొడవున 31 ఎలివేటెడ్ స్టేషన్లను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం ప్రధాని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కొత్త ప్రాజెక్టులతో ప్రాంతీయ అనుసంధానం మెరుగుపడటంతో పాటు, ప్రయాణికులకు వేగవంతమైన, ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
Narendra Modi
Vande Bharat Express
Bengaluru
Belagavi
Karnataka
Indian Railways
Bengaluru Metro
Metro Phase 3
Yellow Line
Electronic City

More Telugu News