రైల్వే సరికొత్త ఆఫర్.. 'రౌండ్ ట్రిప్ ప్యాకేజీ'తో టికెట్ ధరలో రాయితీ
- పండుగ రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ కొత్త పథకం
- 'రౌండ్ ట్రిప్ ప్యాకేజీ' పేరుతో ప్రయాణికులకు ఆఫర్
- తిరుగు ప్రయాణం బేస్ ఫేర్లో 20 శాతం రాయితీ
- అక్టోబర్, నవంబర్ నెలల ప్రయాణాలకు వర్తింపు
- ఆగస్టు 14 నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభం
- ఈ స్కీమ్ కింద బుక్ చేసిన టికెట్లకు నో రీఫండ్
రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే ప్రయాణికులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వెళ్లే ప్రయాణానికి, తిరుగు ప్రయాణానికి ఒకేసారి టికెట్లు బుక్ చేసుకోవాలి. ప్రయాణికుల వివరాలు, ప్రయాణించే క్లాస్, బయలుదేరే స్థానం, గమ్యస్థానం రెండింటికీ ఒకేలా ఉండాలి. ఈ పథకం కింద టికెట్ల బుకింగ్ ఈ నెల 14న ప్రారంభమవుతుంది.
ఈ ఆఫర్ నిర్దిష్ట తేదీలలో ప్రయాణించే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 26 మధ్య ప్రారంభమయ్యే రైళ్లలో వెళ్లే ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకోవాలి. అనంతరం, నవంబర్ 17 నుంచి డిసెంబర్ 1 మధ్య ప్రారంభమయ్యే రైళ్లలో తిరుగు ప్రయాణానికి 'కనెక్టింగ్ జర్నీ' ఫీచర్ను ఉపయోగించి టికెట్ రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణ టికెట్ బుకింగ్కు అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ఏఆర్పీ) వర్తించదని రైల్వే స్పష్టం చేసింది.
అయితే, ఈ పథకానికి కొన్ని కఠినమైన షరతులు కూడా ఉన్నాయి. ఈ స్కీమ్ కింద బుక్ చేసుకున్న టికెట్లకు ఎలాంటి రీఫండ్ ఇవ్వబడదు. అలాగే, టికెట్లలో ఎలాంటి మార్పులు చేయడానికి వీలుండదు. రెండు వైపులా కన్ఫర్మ్ అయిన టికెట్లకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. ఫ్లెక్సీ ఫేర్ విధానం ఉన్న రైళ్లు మినహా అన్ని రైళ్లు, అన్ని క్లాసులలో ఈ పథకం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్.. ఏ పద్ధతిలోనైనా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కానీ, రెండు టికెట్లనూ ఒకే విధానంలో బుక్ చేయాల్సి ఉంటుంది. పండుగల సమయంలో రద్దీని నియంత్రించి, రైళ్ల వినియోగాన్ని రెండు వైపులా పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని రైల్వే శాఖ వివరించింది.