ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పాక్‌లో ఆందోళనలు.. వందలాది మంది అరెస్ట్

  • ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పాక్‌లో ఉద్రిక్తత.. 500 మందికి పైగా అరెస్ట్!
  • పంజాబ్ ప్రావిన్స్‌లోనే అత్యధికంగా అరెస్టులు
  • ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిరసనలు
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఏ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఇమ్రాన్‌ ఖాన్‌ 2023 నుంచి వివిధ కేసుల్లో అడియాలా జైల్లో ఉన్నారు.. ఇమ్రాన్‌ ఖాన్‌ను అక్రమంగా అరెస్టు చేశారని, వెంటనే విడిపించాలంటూ పీటీఐ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనల సందర్భంగా 500 మందికి పైగా పీటీఐ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని పార్టీ వర్గాలు ఆరోపించాయి. ముఖ్యంగా పంజాబ్‌ ప్రావిన్స్‌లో అత్యధిక అరెస్టులు జరిగినట్లు తెలిపాయి.

ఇమ్రాన్‌ ఖాన్‌ జైల్లో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నిరసనలు చేపట్టినట్లు పీటీఐ నేతలు పేర్కొన్నారు. ఆయన ప్రాథమిక హక్కులను ప్రభుత్వం హరించిందని, న్యాయ బృందం లేదా కుటుంబ సభ్యులు ఆయన్ను కలిసేందుకు కూడా అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం నిరసనలను అడ్డుకునేందుకు హైవేలను మూసివేయడం, పీటీఐ జెండాలతో ఉన్న వాహనాలను అడ్డుకోవడం వంటి చర్యలు చేపట్టినట్లు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల ప్రతినిధి బుఖారీ విమర్శించారు. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు కాలరాస్తున్నారని, ప్రజలపై నిరంకుశంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరి సిగ్గుచేటని ఆయన ఆరోపించారు.


More Telugu News