‘మీ దేశానికి వెళ్లిపోండి’.. ఐర్లాండ్‌లో భారత క్యాబ్ డ్రైవర్‌పై దాడి

  • ప్రయాణికులుగా నటించి, సీసాతో తలపై కొట్టిన దుండగులు
  • 'మీ దేశానికి వెళ్లిపోండి' అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలు
  • గత 23 ఏళ్లుగా ఐర్లాండ్‌లోనే నివసిస్తున్న బాధితుడు
  • భారతీయులు జాగ్రత్తగా ఉండాలన్న భారత రాయబార కార్యాలయం
ఐర్లాండ్‌లో భారత సంతతికి చెందిన క్యాబ్ డ్రైవర్‌పై దారుణమైన జాతి వివక్ష దాడి జరిగింది. "మీ దేశానికి మీరు తిరిగి వెళ్లిపోండి" అంటూ ఇద్దరు యువకులు ఆయనపై సీసాతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన డబ్లిన్ శివారు ప్రాంతమైన బాలిమన్‌లోని పాపిన్‌ట్రీ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గత 23 ఏళ్లుగా ఐర్లాండ్‌లో నివసిస్తూ, పదేళ్లుగా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న లఖ్‌వీర్ సింగ్ తన క్యాబ్‌లో ఇద్దరు యువకులను ఎక్కించుకున్నారు. వారు కోరిన ప్రాంతానికి చేర్చిన తర్వాత, అకస్మాత్తుగా ఆ యువకులు కారు డోర్ తెరిచి, తమ వెంట తెచ్చుకున్న సీసాతో లఖ్‌వీర్ సింగ్ తలపై రెండుసార్లు బలంగా కొట్టారు. అనంతరం "మీ దేశానికి వెళ్లిపోండి" అంటూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తూ అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఊహించని దాడితో లఖ్‌వీర్ సింగ్ తీవ్ర రక్తస్రావంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సహాయం కోసం సమీపంలోని ఇళ్ల తలుపులు తట్టినా ఎవరూ స్పందించలేదు. చివరకు, ఆయనే అత్యవసర సేవలకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, పారామెడికల్ సిబ్బంది ఆయన్ను బ్యూమాంట్ ఆసుపత్రికి తరలించారు. దాడి కారణంగా కారు మొత్తం రక్తంతో నిండిపోయిందని సమాచారం.

ఈ ఘటనతో తాను, తన కుటుంబం తీవ్ర భయాందోళనలకు గురయ్యామని లఖ్‌వీర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. "గత పదేళ్ల నా డ్రైవింగ్ జీవితంలో ఇలాంటి భయంకరమైన అనుభవాన్ని ఎప్పుడూ చూడలేదు" అని ఆయన మీడియాకు తెలిపారు. కాగా, ఇటీవల ఐర్లాండ్‌లో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. 

ఈ క్రమంలో ఐర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు కీలక సూచనలు జారీ చేసింది. నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లవద్దని, అనుమానాస్పద సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసర సహాయం కోసం సంప్రదించాల్సిన నంబర్లను కూడా అందుబాటులో ఉంచింది. ఈ దాడితో ఐర్లాండ్‌లోని భారతీయ సమాజంలో భయాందోళనలు మరింత పెరిగాయి.


More Telugu News