F-35 Fighter Jets: ఎఫ్-35 యుద్ధ విమానాల కోసం అమెరికాతో చర్చలు జరగలేదు: లోక్ సభకు తెలిపిన కేంద్రం

ఎఫ్-35 ఐదవ తరం యుద్ధ విమానాల కొనుగోలుపై అమెరికాతో ఎలాంటి అధికారిక చర్చలు జరపలేదని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్‌కు వెళ్లిన సందర్భంగా జారీ చేసిన భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలో ఈ అంశంపై సూచనలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.

కాంగ్రెస్ ఎంపీ బల్వంత్ బస్వంత్ వాంఖడే లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఎఫ్-35 విమానాల విక్రయంపై అధికారిక ప్రతిపాదన వచ్చిందా అని ఎంపీ ప్రశ్నించగా, “ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదు” అని మంత్రి స్పష్టం చేశారు.

ఫిబ్రవరి 13న జారీ చేసిన భారత్-అమెరికా సంయుక్త ప్రకటనలో, ఎఫ్-35 వంటి అధునాతన ఆయుధ వ్యవస్థలు, సముద్ర రక్షణ వ్యవస్థల విడుదలకు సంబంధించిన విధానాన్ని అమెరికా సమీక్షించే అవకాశం ఉందని పేర్కొన్నప్పటికీ, ఆ దిశగా ఎలాంటి సంభాషణలు జరగలేదని మంత్రి వివరించారు.

అటు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఎగుమతులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, భారత్ ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగడం లేదని బ్లూమ్‌బెర్గ్ నివేదిక పేర్కొంది. బదులుగా, అమెరికా నుంచి సహజ వాయువు, కమ్యూనికేషన్ సామగ్రి, బంగారం వంటి దిగుమతులను పెంచే దిశగా భారత్ ఆలోచిస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది. అయితే, అమెరికా ఎఫ్-35 యుద్ధ విమానాలతో సహా కొత్త రక్షణ కొనుగోళ్లను పరిశీలించడం లేదని స్పష్టం చేసింది. 
F-35 Fighter Jets
United States
India
Narendra Modi
Defense
Military
Donald Trump
Arms Deal

More Telugu News