భారత్ లో క్రికెట్ మ్యాచ్ ఆడనున్న సాకర్ స్టార్ మెస్సీ!

  • డిసెంబరు 13 నుంచి 15 వరకు మెస్సీ భారత్ టూర్!
  • ముంబై, ఢిల్లీ, కోల్‌కతాలో అభిమానులను కలిసేందుకు ప్రమోషనల్ టూర్‌
  • ముంబై వాంఖెడే స్టేడియంలో భారత దిగ్గజాలతో కలిసి క్రికెట్ మ్యాచ్
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మరోసారి భారత్ పర్యటనకు రానున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మెస్సీ డిసెంబర్ 13 నుంచి 15 వరకు ముంబయి, దిల్లీ, కోల్‌కతాలో అభిమానులను కలిసేందుకు ఈ ప్రమోషనల్ టూర్‌ను ప్లాన్ చేస్తున్నారు. 2011 తర్వాత మెస్సీ భారత్‌కు రావడం ఇది రెండోసారి కానుంది. ముఖ్యంగా, ఈ పర్యటనలో సాకర్ స్టార్ మెస్సీ ఓ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడుతున్నాడని తెలుస్తోంది. 

ముంబయిలోని వాంఖడే స్టేడియంలో డిసెంబర్ 14న సచిన్, ధోనీ, రోహిత్, విరాట్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలతో మెస్సీ క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) వర్గాలు తెలిపాయి. ఈ ఈవెంట్ కోసం గ్రౌండ్‌ను బుక్ చేసేందుకు ఒక ఏజెన్సీ ఇప్పటికే ఎంసీఏను సంప్రదించింది. షెడ్యూల్ ఖరారైతే త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

కోల్‌కతాలో చిన్నారుల కోసం మెస్సీ ఫుట్‌బాల్ వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో అతడి గౌరవార్థం ‘GOAT CUP’ మ్యాచ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అయితే, కేరళలో అక్టోబర్ లేదా నవంబర్‌లో అర్జెంటీనా జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతుందన్న ప్రకటన ఇప్పుడు మెస్సీ డిసెంబర్ షెడ్యూల్ కారణంగా అనుమానంలో పడింది.



More Telugu News