భారత్‌కు సునామీ ముప్పు?.. ఇన్‌కాయిస్ ఏం చెప్పిందంటే!

  • రష్యాను కుదిపేసిన భారీ భూకంపం  
  • ఈ భూకంపం తీవ్రతతో రష్యా, జపాన్‌, అమెరికా తీర ప్రాంతాలను తాకిన‌ సునామీ
  • భారత్‌కు కూడా సునామీ ముప్పు పొంచి ఉందా? అన్న అనుమానాలు
  • భారత్‌కు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఇన్‌కాయిస్ స్ప‌ష్టీక‌ర‌ణ‌
రష్యాను భారీ భూకంపం కుదిపేసిన విషయం తెలిసిందే. రష్యా తీరంలోని కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రతను 8.8గా గుర్తించారు. ఈ భూకంపం తీవ్రతతో రష్యాతో పాటు జపాన్‌, అమెరికా తీర ప్రాంతాలను సునామీ తాకింది.

ఈ క్రమంలో భారత్‌కు కూడా సునామీ ముప్పు పొంచి ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇన్‌కాయిస్ (ఇండియన్ నేషనల్‌ సెంటర్ ఫర్‌ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్) స్పందించింది. భారత్‌కు ఎలాంటి సునామీ ముప్పు లేదని స్ప‌ష్టం చేసింది. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదని తెలిపింది. ఈ మేరకు ఇన్‌కాయిస్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)లో పోస్టు చేసింది. 

"కంచట్కా తూర్పు తీరంలో 8.8 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చింది. అనంత‌రం సునామీ తాకింది. అయితే, దీని కార‌ణంగా భార‌త్‌కు సునామీ ముప్పు లేదు. హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు కూడా ఎలాంటి ముప్పు లేదు" అని ఇన్‌కాయిస్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చింది.  

ఇక‌, ఈ భూకంపం తర్వాత రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీరప్రాంతాలను సునామీ తాకింది. అమెరికాలోనూ హెచ్చరిక‌లు ఇచ్చారు. హ‌వాయి ద్వీపంలో అప్రమ‌త్తత ప్రక‌టించారు. 


More Telugu News