పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిశోర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

  • తనపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న కిశోర్ 
  • సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు
  • పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమన్న అత్యున్నత న్యాయస్థానం
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడు తురకా కిశోర్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తురకా కిశోర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. 

తనపై ఇక మీదట ఎలాంటి ఎఫ్ఐఆర్ లు నమోదు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కిశోర్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక తనపై 9 కేసులు నమోదు చేశారని, ఇంకా మరికొన్ని ఎఫ్ఐఆర్ లు నమోదు చేయనున్నారని కిశోర్ తన పిటిషన్ లో పేర్కొన్నాడు. అయితే, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం అతడి పిటిషన్ ను డిస్మిస్ చేసింది. 

మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిశోర్ గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై దాడికి పాల్పడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. అతడిపై అనేక ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. వాటిలో మూడు హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. 

ఎన్నికల ఘటనల నేపథ్యంలో, పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లగా, వారి అనుచరులు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో, మల్కాజిగిరి జైపురి కాలనీలో తురకా కిశోర్ ను పోలీసులు ఈ ఏడాది జనవరిలో అరెస్ట్ చేశారు. 


More Telugu News