'ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్' సినిమాపై మేక‌ర్స్ కీల‌క అప్‌డేట్

  • ప‌వ‌న్ క‌ల్యాణ్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబోలో 'ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్'
  • ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న సినిమా
  • మూవీ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయిన‌ట్లు ప్ర‌క‌టించిన మేక‌ర్స్
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్'. ప్ర‌స్తుతం ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌పై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ కీల‌క అప్డేట్ ఇచ్చింది. మూవీ క్లైమాక్స్ షూటింగ్ పూర్తి అయిన‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్టు పెట్టింది. 

" 'ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌' క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది. భావోద్వేగాలు, యాక్షన్‌తో కూడిన అద్భుతమైన క్లైమాక్స్.  నబకాంత్‌ మాస్టర్ పర్యవేక్షణలో షూటింగ్ ముగిసింది. ఏపీ డిప్యూటీ సీఎంగా క్యాబినెట్ సమావేశాలు, బాధ్యతలు ఉన్నప్పటికీ, హరిహర వీరమల్లు ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన్నప్పటికీ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు షూటింగ్‌ను వేగంగా పూర్తి చేశారు. ఇది ఆయన అంకితభావం, కష్టపడి పనిచేసే స్వభావానికి నిదర్శనం" అంటూ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. 

కాగా, ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాశీఖన్నా మ‌రో కీల‌క‌ పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తోన్నఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గ‌బ్బ‌ర్ సింగ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ప‌వ‌న్‌, హ‌రీశ్ శంక‌ర్ కాంబోలో వ‌స్తున్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. 


More Telugu News