వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. మహిళ గర్భంలో కాకుండా కాలేయంలో పెరుగుతున్న పిండం!

  • కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న మహిళ
  • ఆసుపత్రి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి
  • దీనిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారన్న వైద్యులు
  • ప్రపంచవ్యాప్తంగా 1954 నుంచి 1999 వరకు కేవలం 14 కేసులు మాత్రమే నమోదు
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అత్యంత అరుదైన, ఆశ్చర్యకరమైన వైద్య కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ గర్భాశయంలో కాకుండా నేరుగా కాలేయంలో 12 వారాల (మూడు నెలల) పిండం అభివృద్ధి చెందుతున్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఈ విచిత్ర ఘటన వైద్య నిపుణులను షాక్‌కు గురిచేసింది.

బులంద్‌షహర్‌కు చెందిన ఒక మహిళ గత రెండు నెలలుగా తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతోంది. దీంతో ఆమె మీరట్‌లోని ఓ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఆమెకు ఎంఆర్ఐ స్కానింగ్ చేసిన వైద్యులు నిర్ఘాంతపోయారు. ఆమె కాలేయంలో పిండం పెరుగుతున్నట్టు గుర్తించి ఆశ్చర్యపోయారు. పిండం గుండె కొట్టుకుంటున్నట్టు డాక్టర్ కె.కె. గుప్తా నిర్ధారించారు. అంటే అది సజీవంగా ఉండి అభివృద్ధి చెందుతోంది. మహిళకు మరింత ప్రత్యేక చికిత్స కోసం గైనకాలజిస్ట్‌కు రిఫర్ చేశారు.

ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి?
ఈ ఘటనను ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీగా అంటారని డాక్టర్ గుప్తా పేర్కొన్నారు. ఇది అత్యంత అరుదైన ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రకం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఒక గర్భధారణ సమస్య. ఇందులో ఫలదీకరణం చెందిన గుడ్డు సాధారణంగా గర్భాశయంలో అతుక్కోవాలి. కానీ అలా కాకుండా వేరే చోట అతుక్కుని వృద్ధి చెందుతుంది. సాధారణంగా ఇది ఫెలోపియన్ ట్యూబ్‌లో (దాదాపు 97 శాతం కేసులలో) జరుగుతుంది. అయితే అరుదుగా లివర్, స్ప్లీన్ (ప్లీహం), ఓవరీ (అండాశయం), లేదా బొడ్డు కుహరంలో కూడా సంభవించవచ్చు.

లివర్‌లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వైద్య చరిత్రలో అత్యంత అరుదైన కేసు. ప్రపంచవ్యాప్తంగా 1954 నుంచి 1999 వరకు కేవలం 14 కేసులు మాత్రమే నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి. ఈ కేసు వైద్య ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. 


More Telugu News