మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్‌ చేసుకోవాలా?: రష్యా చమురు కొనుగోలు విషయంలో పశ్చిమ దేశాలపై భారత్ ఫైర్‌

  • ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు
  • ఆంక్షలు ఉన్నప్పటికీ మాస్కో నుంచి భారత్‌ పెద్ద ఎత్తున చమురు దిగుమతి 
  • భార‌త్‌.. రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై పశ్చిమ దేశాలు అభ్యంతరం
  • పశ్చిమ దేశాల విమర్శలను తోసిపుచ్చిన బ్రిట‌న్‌లోని భారత హైకమిషనర్‌
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆంక్షలు ఉన్నప్పటికీ మాస్కో నుంచి భారత్‌ పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో రష్యా చమురు దిగుమతి చేసుకోవడంపై పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. దీనిపై తాజాగా భారత్ ఘాటుగా స్పందించింది. పశ్చిమ దేశాల విమర్శలను బ్రిట‌న్‌లోని భారత హైకమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామి తోసిపుచ్చారు. ఏ దేశం కూడా తమ ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్‌ చేసుకోవాలని అనుకోదన్నారు.

బ్రిటిష్‌ రేడియో స్టేషన్‌ టైమ్స్‌ రేడియోతో దొరైస్వామి మాట్లాడుతూ.. భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు అని తెలిపారు. దేశ అవసరాల్లో 80 శాతం దిగుమతులపైనే అధారపడుతున్నట్లు పేర్కొన్నారు. రష్యా నుంచి చౌక ధరకు చమురు దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. అవసరాల మేరకు రాయితీపై చమురును ఎలా కొనుగోలు చేయకుండా ఉంటాం? అని ఆయ‌న‌ ప్రశ్నించారు. పశ్చిమ దేశాలు భార‌త్‌పై విమర్శలు చేస్తున్నాయన్నారు. "మేం ఏం చేయాలని పశ్చిమ దేశాలు కోరుకుంటున్నాయి? మా ఆర్థిక వ్యవస్థను స్విచ్చాఫ్‌ చేసుకోవాలా?" అంటూ ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 


More Telugu News