స్కూల్ వాష్‌రూమ్‌లో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి

  • సెంట్రల్ ఢిల్లీలోని ఓ స్కూల్‌లో ఘటన
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
  • బాలుడిపై లైంగికదాడి జరిగినట్టు వైద్యుల నిర్ధారణ
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ స్కూల్‌లో 14 ఏళ్ల బాలుడిపై జరిగిన లైంగికదాడి ఘటన కలకలం రేపుతోంది. సెంట్రల్ ఢిల్లీలోని ఓ స్కూల్ వాష్‌రూమ్‌లో ఈ దారుణం జరిగింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24న ఈ ఘటన జరగ్గా పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడికి వైద్య పరీక్షలు నిర్వహించి, కౌన్సెలింగ్ అందించారు.

24న సాయంత్రం 4:43 గంటల సమయంలో పోలీసులకు ఒక పీసీఆర్ కాల్ వచ్చింది. స్కూల్ వాష్‌రూమ్‌లో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి జరిగినట్టు కాలర్ సమాచారం అందించాడు. పోలీస్ బృందం వెంటనే స్కూల్‌కు చేరుకుంది. అయితే, అంతకుముందే ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు వారితో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. బాధితుడికి కౌన్సెలింగ్ సెషన్‌లు ఏర్పాటు చేయడంతో పాటు, వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. డాక్టర్ నుంచి మెడికో-లీగల్ సర్టిఫికెట్ అందిన తర్వాత బాలుడిపై లైంగిక వేధింపులు జరిగినట్టు పోలీసులు ధ్రువీకరించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

ఢిల్లీలో పెరుగుతున్న పోక్సో కేసులు
ఢిల్లీలో మైనర్లపై లైంగిక వేధింపులు ఆరోపణలతో సగటున రోజుకు ఐదుగురు వ్యక్తులు అరెస్టు అవుతున్నారు. ప్రతి రోజు దాదాపు నాలుగు కేసులు పోక్సో చట్టం కింద నమోదవుతున్నాయి. ఈ గణాంకాలు పిల్లలపై జరుగుతున్న నేరాల తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News