హ‌ర్మ‌న్ సేన అదుర్స్‌.. వ‌న్డే సిరీస్ టీమిండియాదే

  • డర్హమ్‌ వేదికగా భార‌త్‌, ఇంగ్లండ్ మ్యాచ్‌
  • 13 ప‌రుగుల తేడాతో ఆతిథ్య జ‌ట్టును ఓడించిన టీమిండియా
  • 319 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఇంగ్లండ్ 305 ప‌రుగుల‌కే ఆలౌట్
  • ఈ విజ‌యంతో 2-1 తేడాతో సిరీస్‌ హ‌ర్మ‌న్ సేన సొంతం
  • సూప‌ర్ శ‌త‌కం (102)తో అద‌ర‌గొట్టిన కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్  
ఇంగ్లండ్‌ పర్యటనలో టీ20 సిరీస్‌ గెలిచిన భారత మహిళల క్రికెట్‌ జట్టు.. వన్డే సిరీస్‌నూ కైవసం చేసుకుంది. ఆతిథ్య జట్టుతో డర్హమ్‌ వేదికగా జరిగిన చివరి వన్డేలో టీమిండియా 13 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. 319 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఇంగ్లండ్ 305 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో బ్రంట్ (98) త్రుటిలో సెంచ‌రీ చేజార్చుకోగా.. ఎమ్మా (68) మిన‌హా మిగ‌తా బ్యాట‌ర్లు విఫ‌ల‌మ‌య్యారు. భార‌త బౌల‌ర్ల‌లో క్రాంతి ఆరు వికెట్ల‌తో స‌త్తాచాటారు. చ‌ర‌ణి 2, దీప్తి ఒక వికెట్ తీశారు. ఈ విజ‌యంతో 2-1 తేడాతో సిరీస్‌ను హ‌ర్మ‌న్ సేన సొంతం చేసుకుంది.    

అంతకుముందు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు మొదట బ్యాటింగ్‌ చేస్తూ 50 ఓవర్లకు 318/5 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (102) తన కెరీర్‌లో ఏడో శతకంతో కదం తొక్కగా జెమీమా (50), హర్లీన్‌ (45), మంద‌న (45) రాణించారు. ఆఖర్లో రిచా ఘోష్‌ (38 నాటౌట్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్ తో విరుచుకుప‌డ‌డంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. 40 ఓవర్లకు భారత్‌.. 198/3 తోనే ఉన్నా ఆఖరి 60 బంతుల్లో ఏకంగా 120 ర‌న్స్‌ రాబట్టింది. 54 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసిన హర్మన్‌ ప్రీత్‌ తర్వాత శతకానికి 28 బంతులు మాత్రమే తీసుకుంది. 

చ‌రిత్ర సృష్టించిన భార‌త కెప్టెన్‌
ఈ మ్యాచ్‌లో భార‌త కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సూప‌ర్ శ‌త‌కం (84 బంతుల్లో 102 ప‌రుగులు)తో అద‌ర‌గొట్టింది. దీంతో ఇంగ్లండ్‌లో మూడు సెంచ‌రీలు చేసిన ఏకైక విదేశీ ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది. ఈ క్ర‌మంలో మిథాలీ రాజ్ (2), మెగ్ లానింగ్ (2)ను అధిగ‌మించింది. మ‌రోవైపు భార‌త్ త‌ర‌ఫున రెండో ఫాస్టెస్ట్ సెంచ‌రీని హ‌ర్మ‌న్ న‌మోదు చేసింది. అలాగే వ‌న్డేల్లో 4వేల ప‌రుగులు పూర్తి చేసిన భార‌త‌ మూడో మ‌హిళా క్రికెట‌ర్‌గా నిలిచింది.  


More Telugu News