Chandrababu Naidu: అమరావతిలో క్వాంటం వ్యాలీ... శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్

Chandrababu Naidu Inaugurates Quantum Valley in Amaravati
  • అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం
  • టెక్ ప్రపంచంలో ఏపీ చారిత్రక అడుగు
  • దేశంలోనే తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు
  • ప్రాజెక్టు కోసం 50 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
  • ఐబీఎం, టీసీఎస్, ఎల్&టీ వంటి దిగ్గజాల భాగస్వామ్యం
ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ, రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్ నిర్మాణానికి తొలి అడుగు పడింది. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ' (AQV) భవన నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో భాగంగా, భారతదేశంలోనే తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను నెలకొల్పనున్నారు. ఈ ప్రాజెక్టులో ఐబీఎం (IBM), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సెన్ అండ్ టూబ్రో (L&T) వంటి దిగ్గజ సంస్థలు భాగస్వాములుగా వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, "1990లలో భారత్‌ను ఐటీ లీడర్‌గా నిలబెట్టడంలో ముందున్నట్లే, ఇప్పుడు అమరావతి నుంచి దేశాన్ని క్వాంటమ్ లీడర్‌గా నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం" అని అన్నారు. బోస్టన్, సింగపూర్, షాంఘై వంటి గ్లోబల్ క్వాంటమ్ కేంద్రాల సరసన అమరావతిని నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, రక్షణ, వైద్యం, ఆర్థిక రంగాల్లో పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఈ వ్యాలీ కేంద్రంగా మారనుంది.

ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 88,000 ఉద్యోగాలు సృష్టించవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు నాటికి భవన నిర్మాణం పూర్తి చేసి, డిసెంబరు నాటికి క్వాంటమ్ కంప్యూటర్‌ను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Chandrababu Naidu
Amaravati Quantum Valley
Andhra Pradesh
Quantum Computing
Jitendra Singh
IBM
TCS
L&T
Technology Hub
Amaravati

More Telugu News