NIMS Hyderabad: అరుదైన ఘనత సాధించిన హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి

హైదరాబాద్‌లోని నిమ్స్ యూరాలజీ విభాగం అరుదైన రికార్డును నెలకొల్పింది. గత ఆరు నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. 1989లో ప్రారంభమైనప్పటి నుంచి మూత్రపిండ మార్పిడి అవసరమైన వారికి నిమ్స్ ఆశాదీపంలా కనిపిస్తోంది.

2015లో సీనియర్ ప్రొఫెసర్, విభాగాధిపతి డా. సి. రామ్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత శస్త్రచికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగింది. డా. రామ్ రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్‌ల బృందం గత పదేళ్లలో 1000కి పైగా కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రతి సంవత్సరం 100కి పైగా మార్పిడులు చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ సంఖ్య మరింత పెరిగింది. దేశంలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసే మూడు అగ్రశ్రేణి వైద్య సంస్థలలో నిమ్స్ ఒకటిగా నిలుస్తోంది.

రోబోటిక్ సిస్టమ్ లభ్యతతో సాంకేతికంగానూ నిమ్స్ ముందంజలో ఉంది. కిడ్నీ మార్పిడులతో పాటు, ఇదే బృందం ప్రతి నెలా 1000కి పైగా ఇతర శస్త్రచికిత్సలు నిర్వహిస్తోంది. అంటే సంవత్సరానికి 12,000కు పైగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అలాగే గత రెండేళ్లలో 350కి పైగా రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించారు.


NIMS Hyderabad
NIMS Urology
Kidney Transplant
Dr Ram Reddy
Dr Rahul Devaraj
Hyderabad News
Telangana Health
Robotic Surgery
Kidney Transplantation India

More Telugu News