Anil Ambani: ఎస్‌బీఐ సంచలన నిర్ణయం.. రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనిల్ అంబానీలను ‘ఫ్రాడ్’గా వర్గీకరించిన బ్యాంకు

Anil Ambani Reliance Communications declared fraud by SBI
షార్ట్స్‌లో చూడండి
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్), దాని ప్రమోటర్ డైరెక్టర్ అనిల్ డి. అంబానీలను అధికారికంగా 'ఫ్రాడ్'గా వర్గీకరించినట్టు నిన్న పార్లమెంట్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు ఫిర్యాదు చేసే ప్రక్రియలో బ్యాంక్ ఉన్నట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో తెలిపారు.

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్దేశించిన 'మోసం రిస్క్ మేనేజ్‌మెంట్ మాస్టర్ డైరెక్షన్స్', ఎస్‌బీఐ బోర్డు ఆమోదించిన పాలసీకి అనుగుణంగా జూన్ 13 న ఈ వర్గీకరణ జరిగినట్టు మంత్రి చౌదరి వివరించారు. ఈ వర్గీకరణను బ్యాంక్ జూన్ 24న ఆర్బీఐకి నివేదించింది.

ఎస్‌బీఐకి ఆర్‌కామ్ పెద్ద మొత్తంలో బకాయి పడింది. ఇందులో రూ. 2,227.64 కోట్ల ఫండ్-బేస్డ్ ప్రిన్సిపల్ బకాయి (ఆగస్టు 26, 2016 నుంచి వడ్డీ, ఇతర ఖర్చులు సహా), రూ. 786.52 కోట్ల నాన్-ఫండ్ బేస్డ్ బ్యాంక్ గ్యారెంటీ ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఆర్‌కామ్ మొత్తం రుణం మార్చి 2025 నాటికి రూ. 40,400 కోట్లుగా ఉన్నట్టు రాయిటర్స్ నివేదించింది.

చట్టపరమైన చిక్కులు
ఆర్‌కామ్ ప్రస్తుతం 2016 నాటి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ (ఐబీసీ) కింద కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రక్రియలో ఉంది. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ రిజల్యూషన్ ప్లాన్‌ను ఆమోదించి, మార్చి 6, 2020న ముంబైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) వద్ద దాఖలు చేసినప్పటికీ, దాని ఆమోదం ఇంకా పెండింగ్‌లో ఉంది. ఈ పరిణామాలకు తోడు ఎస్‌బీఐ అనిల్ డి. అంబానీపై వ్యక్తిగత ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇది ప్రస్తుతం ఎన్‌సీఎల్‌టీ ముంబై వద్ద విచారణలో ఉంది.

గతంలోనూ వివాదం.. న్యాయపరమైన మలుపులు
గతంలో కూడా ఈ 'మోసం' వర్గీకరణకు సంబంధించిన వివాదం తలెత్తింది. నవంబర్ 10, 2020న ఎస్‌బీఐ ఈ ఖాతాను, అనిల్ డి. అంబానీని 'మోసం'గా వర్గీకరించి, జనవరి 5, 2021న సీబీఐకి ఫిర్యాదు చేసింది. అయితే, జనవరి 6, 2021న ఢిల్లీ హైకోర్టు 'స్టేటస్ కో' ఇచ్చింది.

అనంతరం, సుప్రీం కోర్టు మార్చి 27, 2023న ఇచ్చిన తీర్పు (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇతరులు వర్సెస్ రాజేష్ అగర్వాల్.. ఇతరులు కేసు) ప్రకారం, రుణగ్రహీతలకు మోసం వర్గీకరణకు ముందు తమ సమర్థనను వినిపించుకునే అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో, సెప్టెంబర్ 2, 2023న బ్యాంక్ గత మోసం వర్గీకరణను రద్దు చేసింది. అయితే, జులై 15, 2024న ఆర్బీఐ జారీ చేసిన కొత్త సర్క్యులర్ ప్రకారం తిరిగి ప్రక్రియ నిర్వహించి, ఖాతాను మళ్లీ 'మోసం'గా వర్గీకరించింది. 
Go Back to Shorts
Anil Ambani
Reliance Communications
SBI
State Bank of India
Fraud Classification
RCom
RBI
Insolvency and Bankruptcy Code

More Telugu News