ముంబై సబర్బన్ రైళ్లలో పేలుళ్ల కేసు.. 12 మందిని నిర్దోషులుగా ప్రకటించిన బాంబే హైకోర్టు

  • 2006 జులై 11న సబర్బన్ రైళ్లలో పేలుళ్లు
  • ఈ ఘటనలో 188 మంది ప్రాణాలు కోల్పోయిన వైనం
  • దాదాపు రెండు దశాబ్దాలపాటు జైలులో ఉన్న నిందితులు
  • స్పెషల్ కోర్టు తీర్పును కొట్టేసిన హైకోర్టు
2006 జులై 11న ముంబైలోని సబర్బన్ రైళ్లలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో 12 మంది నిందితులను బాంబే హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఏడు రైళ్లలో దాడులు జరగ్గా మొత్తం 188 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 800 మందికిపైగా గాయపడ్డారు.

2015లో స్పెషల్ కోర్టు ఇచ్చిన తీర్పును  జస్టిస్ ఎస్.ఎస్. షిండే, జస్టిస్ మనీశ్ పిటాలేలతో కూడిన డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది. కాగా, ప్రత్యేక కోర్టు ఈ 12 మంది నిందితులను దోషులుగా ప్రకటించి వారిలో ఏడుగురికి మరణశిక్ష, ఐదుగురికి జీవిత ఖైదు విధించడం గమనార్హం.

 ప్రాసిక్యూషన్ ప్రకారం.. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) సభ్యులు ఈ దాడులను ప్లాన్ చేసి అమలు చేశారు. నిందితులపై చేసిన ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడం, సాక్ష్యాలు లేకపోవడం, దర్యాప్తులో లోపాలను గుర్తించిన న్యాయస్థానం.. నిందితులకు, ఈ దాడులకు సంబంధం లేదని పేర్కొంది.  వారిని విడుదల చేయాలని ఆదేశించింది.

ముంబై సబర్బన్ రైలు నెట్‌వర్క్‌లోని ఖార్ రోడ్, బాంద్రా, జోగేశ్వరి, బోరివలి, మాతుంగా, మీరా రోడ్, మహిమ్ జంక్షన్ స్టేషన్లలో ఆ రోజు సాయంత్రం 6:24 నుంచి 6:35 గంటల మధ్య జరిగాయి. పేలుళ్లు రైళ్లలోని ఫస్ట్-క్లాస్ కంపార్ట్‌మెంట్‌లలో సంభవించాయి. రద్దీ సమయంలో పేలుళ్లు జరగడంతో ప్రాణనష్టం భారీగా సంభవించింది. కాగా, నిర్దోషులుగా విడుదల కానున్న నిందితులు దాదాపు రెండు దశాబ్దాలుగా జైలు జీవితం గడిపారు. తాజాగా బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు వారి కుటుంబాలకు భారీ ఊరటనిచ్చింది. 


More Telugu News